సాక్షి, చెన్నై: తిరుచ్చి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం విజయ్ సోమవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందు కోసం తిరుచ్చి తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివరాలు.. సీఎం విజయ్ చెన్నై పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలలో పోటీ చేసిన విషయం తెలిసిందే. తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేశారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టడం, మంత్రి వర్గం విస్తరణ, వాగ్దానాల అమలు, ఢిల్లీ పర్యటన అంటూ బిజీగా ఉన్న విజయ్ ఎట్టకేలకు తిరుచ్చి తూర్పు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం సోమవారం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్ సీఎంగా బాధ్యలు చేపట్టినానంతరం ప్రజలలోకి ప్రథమంగా వస్తున్నారు.
చెన్నై నుంచి తిరుచ్చికి విజయ్ విమానంలో వెళ్లారు. తిరుచ్చి విమానాశ్రయం టెర్మినల్ నుండి తన సొంత, ప్రత్యేక వాహనంలో (ఓపెన్ వ్యాన్)లో బయలుదేరుతారు. తిరుచ్చి–పుదుక్కోట్టై రోడ్డులోని టీవీఎస్ టోల్ గేట్, ఓల్డ్ డెయిరీ ఫామ్ ,మిల్క్ స్టేషన్ మీదుగా ప్రయాణించి సెయింట్ జోసెఫ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఆయన ఓపెన్ వ్యాన్లో నిలబడి ప్రజలకు , కార్యరర్తలకు చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతూ, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రసంగిస్తారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన తమిళనాడులోని ఇతర జిల్లాలలో కూడా పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారని సమాచారం.


