సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు నిషేధం విధించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించడం నిషేధమని స్పష్టం చేసింది.
ఇటీవల రాష్ట్రంలో భారీ కటౌట్లు, పోస్టర్లు పాదచారుల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. పాదచారులు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు పెరిగాయి.
వర్షాకాలం ప్రారంభం కావడంతో బ్యానర్లు, కటౌట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అదే సమయంలో టీవీకే తన పార్టీ కార్యకర్తలకు సైతం విజ్ఞప్తి చేసింది. పార్టీ కార్యకర్తలు పోస్టర్లు, బ్యానర్లు, ప్లకార్డులు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించొద్దని కోరింది. జన్మదిన వేడుకలు, కుటుంబ వేడుకలు, రాజకీయ సమావేశాలు వంటి సందర్భాల్లో బహిరంగ ప్రదేశాల్లో డెకరేషన్లు చేయద్దని సూచించింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ఏ వేడుకలు జరపరాదని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
గత నెలలో పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను విజయ్ మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం, ఆయన తన తమిళగ వెట్రి కజగం కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజులు, కుటుంబ కార్యక్రమాల వంటి సందర్భాలలో ప్రజలకు లేదా ట్రాఫిక్కు ఆటంకం కలిగించే విధంగా... బహిరంగ ప్రదేశాలలో బ్యానర్లు, పోస్టర్లు అంటించొద్దని కోరారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు,కటౌట్లు,పోస్టర్లు అంటించడంపై ఆంక్షలు విధించడంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


