సాక్షి,అమరావతి: సాక్షి,అమరావతి: ఏపీ డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఏపీ నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అంతా కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
డీఎస్సీ, కానిస్టేబుల్స్,ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరినీ ఏకం చేస్తూ నూతనంగా ‘నిరుద్యోగ జేఏసీ’ని ఏర్పాటు చేసినట్లు ప్రతినిధులు ప్రకటించారు. ఈ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా ఎంబేటి రామచంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించేందుకు, తమ సమస్యలను విన్నవించుకునేందుకు మంత్రి లోకేష్ దగ్గరకు వెళ్లిన నిరుద్యోగులను పోలీసులు కుక్కలను తరిమినట్లు తరిమేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులపై జరుగుతున్న ఇటువంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ భవిష్యత్తు కార్యాచరణను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు పోలీసు నియామకాలపై కూడా జేఏసీ మండిపడింది. గత ప్రభుత్వ హయాంలోనే 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగిందని, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పోస్టుల భర్తీపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది.
కాగా డీఎస్సీ అక్రమాలపై ఇదివరకే వైఎస్సార్సీపీ ఉద్యమ బాట ప్రకటించింది. డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని, ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి కింద రూ.3,000 చొప్పున వెంటనే ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విషయం విధితమే.


