సాక్షి, విశాఖపట్నం: స్నేహితుల దినోత్సవం రోజు విషాదం చోటుచేసుకుంది. యారాడ బీచ్లో యువతి, యువకుడు గల్లంతయ్యారు. ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో సముద్రంలో గల్లంతయినట్లు సమాచారం. యువతి నీతుని రక్షించబోయి మరో యువకుడు రాము గల్లంతయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన న్యూ పోర్టు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తేన్నేటి పార్క్, సాగర్ నగర్, రుషి కొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో వాటిపై నిల్చుని సాగరం అందాలను వీక్షిస్తుంటారు. అయితే కొంత మంది సరదాగా స్నానాలు చేసేందుకు, ఫోటోలు తీసుకోవడానికి దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు.
విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండడంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్న వారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడడం అసాధ్యం.



