తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను చాలామంది దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్తో పోల్చుతున్నారు. సినీ రంగం నుంచే ఇద్దరూ రాజకీయాల్లోకి రావడం, ఎంజీఆర్లాగే విజయ్ కూడా తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు కావడంతో ఈ పోలిక వస్తోంది.
అభిమాన సంఘాల నెట్వర్క్, పేదలు, యువతపై దృష్టి పెట్టడం, ప్రజాకర్షణ వంటి అంశాలూ దీనికి కారణం. ఎంజీఆర్లా చాలా సంవత్సరాలు విజయ్ కూడా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఎంజీఆర్తో విజయ్ను పోల్చడం సరికాదని పుతియ తమిళగం వ్యవస్థాపకుడు డాక్టర్ కే కృష్ణస్వామి అంటున్నారు. ఎందుకో వివరించి చెప్పారు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ కె.కృష్ణస్వామి మాట్లాడుతూ.. ‘‘ఎంజీఆర్ రాజకీయ నేపథ్యంతో విజయ్ను చూడొద్దు. నేను విజయ్ను ఎంజీఆర్తో పోల్చడం లేదు. ఎంజీఆర్ ఎంజీఆరే. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన దాదాపు 59-60 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంది. 2026 శాసనసభ ఎన్నికలు ఆ ఆలోచనకు వచ్చిన ఫలితం.
డీఎంకేపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తేలికగా తీసుకోకూడదు. కఠినంగా వ్యవహరించకూడదు. దక్షిణ తమిళనాడులో పరువు హత్యలు జరుగుతున్నాయి. మహిళల భద్రతపై ఆందోళన పెరిగింది. యువకులు మద్యం బానిసలుగా మారుతున్నారు. అందువల్లే డీఎంకేపై ఇటీవల ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఏ గ్రామం వదలకుండా, ఏ వీధి వదలకుండా మాదకద్రవ్యాల సంస్కృతి విస్తరించింది’’ అని చెప్పారు.
సినిమాలు చూసి ప్రభావితమయ్యారు..
‘‘సామాజిక న్యాయం అంటే కేవలం కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం కాదు. ఎనిమిది మంది మంత్రులు ఉన్నంత మాత్రాన తమిళనాడులోని కోట్లాది ప్రజలకు సామాజిక న్యాయం స్థాపించలేరు. సినిమాలు చూసి ప్రభావితమై, ఒక వ్యక్తిపై అభిమానం పెంచుకుని చాలా మంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి తమిళనాడులోని గ్రామాల్లో ఏమి జరుగుతుందో తెలియదు. తిరునెల్వేలి జిల్లాలో ఏమి జరుగుతోంది, తూత్తుకుడి జిల్లాలో ఏమి జరుగుతోంది, తెంకాసి జిల్లాలో ఏమి జరుగుతోంది, విల్లుపురం, కడలూరు ప్రాంతాల్లో ఏమి జరుగుతోంది అన్నది తెలియదు’’ అని తెలిపారు. రాజకీయ అవగాహన లేకుండా, ఆకర్షణకులోనై ప్రజలు ఓట్లు వేశారని కృష్ణస్వామి అన్నారు.
విజయకాంత్, శరత్కుమార్, భాగ్యరాజ్ వచ్చారు..
‘‘గత రెండు సంవత్సరాలుగా తమిళనాడులో పెద్ద రాజకీయ మార్పు వస్తుందని నేను చెబుతున్నాను. కానీ ఎవరూ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. 1967లో కాంగ్రెస్ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి దాదాపు 59 సంవత్సరాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల రాజకీయాలే కొనసాగుతున్నాయి.
ఈ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలని చాలామంది ప్రయత్నించారు. మూడో కూటమి ఏర్పాటు చేయాలని చూశారు. ద్రవిడ మున్నేట్ర కళగం వద్దు, అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం వద్దు అని పలువురు రాజకీయ శక్తులు ప్రయత్నించాయి. 1996లో కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నించాయి. 1999లో లోక్సభ ఎన్నికల సమయంలో మేము కూడా ప్రయత్నించాం. 2016లో కొన్ని సంస్థలు ప్రయత్నించాయి.
అదే విధంగా విజయకాంత్ వచ్చారు. శరత్కుమార్ వచ్చారు. భాగ్యరాజ్ వచ్చారు. సినిమా రంగం నుంచి పలువురు వ్యక్తిగత శక్తులుగా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ఉద్యమాలు నడిపినవారు కూడా కలిసి ప్రయత్నాలు చేశారు.
తమిళనాడులో ప్రత్యామ్నాయం కావాలనే భావన నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఒక రోజు దానికి రూపం వస్తుందని అనుకున్నాం. ఇప్పుడు 2026లో కనిపిస్తున్న మార్పే ఆ రూపం. ఇది ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. దాదాపు 59-60 సంవత్సరాలుగా తమిళనాడు ప్రజల్లో ఉన్న ఆలోచనకు వచ్చిన ఫలితం. ఈ భావోద్వేగాన్ని విజయ్ సరైన సమయంలో ఉపయోగించుకున్నారు.
గత రెండు సంవత్సరాలుగా మేము ఒక విషయం చెబుతున్నాం. తమిళనాడులో ఏకపక్ష పాలనకు ముగింపు రావాలి. ఒకే పార్టీ పాలన కాదు, భాగస్వామ్య రాజకీయాలు రావాలి. కానీ చాలా పార్టీలు ఎన్నికల ముందు కలిసి, ఎన్నికల తర్వాత మేమే మార్పు అంటున్నాయి. అది కూడా మరో రూపంలోని ఆధిపత్య రాజకీయమే. ద్రవిడ మున్నేట్ర కళగం మారాలి. అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం మారాలి. అందరికీ రాజకీయ స్థలం ఇవ్వాలి. సమ్మిళిత రాజకీయాలు రావాలి.
ఇప్పటి కాలం మారింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఉన్న సమస్యలు వేరు. ఇప్పుడు అట్టడుగు వర్గాల సమస్యలు ప్రధాన రాజకీయ పార్టీలు పరిష్కరించలేకపోతే ప్రత్యేక సంస్థలు పుట్టుకొస్తాయి. అందుకే మేము పుదియ తమిళగం ఏర్పాటు చేశాం. తమిళనాడులో కుల సమస్య ఇప్పటికీ ఉంది. కుల నిర్మూలన చాలా ముఖ్యమని మేము భావిస్తున్నాం. అందుకే ఆ సమస్యను ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని కృష్ణస్వామి తెలిపారు.


