టీవీకేలో ఏకంగా 300 మంది చేరిక.. ఇక ఆ ప్రతిపక్ష పార్టీ పరిస్థితి? | Tamil Nadu Over 300 AIADMK members join TVK | Sakshi
Sakshi News home page

టీవీకేలో ఏకంగా 300 మంది చేరిక.. ఇక ఆ ప్రతిపక్ష పార్టీ పరిస్థితి?

Jun 6 2026 7:25 PM | Updated on Jun 6 2026 8:20 PM

Tamil Nadu Over 300 AIADMK members join TVK

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో ఉంటే ప్రజలకు సరైన సేవ చేయలేకపోతున్నామని చెబుతూ 300 మందికి పైగా ఆ పార్టీ సభ్యులు టీవీకేలో చేరారు. శనివారం చెన్నై సమీపంలోని పనయూరులో  పార్టీ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా వారు టీవీకేలో చేరి, సీఎం విజయ్‌ నాయకత్వాన్ని కొనియాడారు.

టీవీకేలో చేరిన వారిలో అన్నాడీఎంకే మాజీ మంత్రి వెల్లమండి నటరాజన్, అన్నా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కమలక్కన్నన్, మైలాపూర్ మాజీ ఎమ్మెల్యే నటరాజ్, మాజీ మంత్రి ఆనందన్, పరమక్కుడి మాజీ ఎమ్మెల్యే సాధన్ ప్రభాకర్, తిరుపత్తూర్ నగర కార్యదర్శి డిటి కుమార్, మరో 300 మందికి పైగా ఉన్నారు.

టీవీకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎన్ ఆనంద్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సెంగొట్టైయన్, ప్రజాపనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున సమక్షంలో ఈ చేరిక జరిగింది.

మాజీ మంత్రి, సీనియర్ అన్నాడీఎంకే నాయకుడు ఉదుమలై రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. తనతో పాటు త్రిచి ఎన్ ఆర్ శివపతి, కడంబూర్ రాజు, ఎంసి సంపత్, పన్నీర్‌సెల్వం, గోవిందసామి, కొలత్తూర్ కృష్ణమూర్తి వంటి సీనియర్ నాయకులు అధికార టీవీకేలో చేరినట్లు తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత నాయకత్వాన్ని గుర్తుచేసుకుంటూ, ఆమె హయాంలో అన్నాడీఎంకే కార్యకర్తలు కఠిన క్రమశిక్షణ పాటించారని, ఆమె మరణం పార్టీకి పెద్ద దెబ్బగా మారిందని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా అన్నాడీఎంకేలో కొనసాగినా, ప్రజలకు సమర్థంగా సేవ చేయలేకపోయామని, క్లిష్ట పరిస్థితుల్లో పనిచేశామని రాధాకృష్ణన్ తెలిపారు.

ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌లో ఎంజీఆర్, జయలలిత ఆశయాలు కనిపిస్తున్నాయని, టీవీకేలో లభించిన గౌరవం, గుర్తింపే పార్టీలో చేరేందుకు ప్రేరణగా నిలిచిందని చెప్పారు. టీవీకే కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి సారిస్తూ యువ నాయకత్వానికి మద్దతు ఇస్తామని తెలిపారు.

పార్టీ క్రమశిక్షణ పట్ల తమ అంకితభావాన్ని ప్రస్తావిస్తూ, నాయకత్వం అప్పగించే ఏ బాధ్యతనైనా నమ్మకంగా నిర్వర్తిస్తామని రాధాకృష్ణన్ చెప్పారు. భవిష్యత్తులో జిల్లాస్థాయి కార్యకర్తలు, సీనియర్ అన్నాడీఎంకే నాయకులు మరింత మంది టీవీకేలో చేరే అవకాశం ఉందని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో మంత్రి సెంగొట్టైయన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వాన్ని నమ్మి తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని చెప్పారు. "భారత చరిత్రలో పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే విజయం సాధించిన ఉద్యమం ఏదైనా ఉంటే అది తమిళగ వెట్రి కళగమే. ఎన్ని కూటములు ఏర్పడినా, తమిళ నేలపై పుట్టిన ఎవరూ తమిళనాడులో మా ఉద్యమాన్ని ఓడించలేరు. 

స్వచ్ఛమైన పాలన అందించగల నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించారు. అది సాధించగల వ్యక్తి ఆయనే. ఎప్పటికీ విజయ్ తమిళనాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు. నేను విప్లవ నాయకుడు ఎంజీఆర్‌తో ప్రయాణించాను. విప్లవ నాయకురాలు అమ్మతో కూడా కలిసి పనిచేశాను. విశ్వాసం లేని వారు గెలిచారు. ఇతరులను నమ్మిన వారు ఓటమిని చూశారు" అని అన్నారు.

ఇదే కార్యక్రమంలో ప్రజాపనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. సెంగొట్టైయన్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించే విషయంలో టీవీకే ప్రభుత్వం మాజీ డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలను మించి పనిచేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గాన్ని మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత మంత్రివర్గాలతో పోల్చుతూ.. వారి వారసత్వాన్ని టీవీకే ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు.

"అన్నా, ఎంజీఆర్, పురట్చి తలైవి అమ్మలా నిజాయితీగా ఎదిగిన నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అవుతారని మేము ముందే చెప్పాం. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న పార్టీల నాయకులతో కూర్చున్నారని సెంగొట్టైయన్‌ను అన్నాఏడీఎంకే సభ్యులు ఎగతాళి చేశారు. కానీ ఆయన ఎంజీఆర్ మంత్రివర్గంలో మంత్రి. కుమార్ అమ్మ మంత్రివర్గంలో మంత్రి. ఇప్పుడు ఇద్దరూ జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలో కూడా మంత్రులుగా ఉన్నారు" అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement