సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ చేసిన ఆదివారం వ్యాఖ్యలు కొత్త ట్విస్టుకు దారి తీశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చైన్నెలో నిర్వహించిన డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం తమిళనాడులో మంత్రి పదవుల కోసం రాజకీయ నాయకులు ఎగబడుతున్నారని ప్రేమలత ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత, ప్రస్తుత సీఎం విజయ్ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘నేను అనుకుంటే విజయ్ను కలవడం పెద్ద విషయమా? అని పేర్కొంటూ, ఇప్పుడు చాలా మంది మంత్రి పదవుల కోసం ఆయన చుట్టూ పరుగులు తీస్తున్నారు. అయితే, నేను గనుక ఒక్క మాట చెప్పి ఉంటే.. విజయ్ స్వయంగా నా ఇంటికి వచ్చి మరీ నాకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఉండేవారు. ఇది పచ్చి నిజం.’ అని వ్యాఖ్యలు చేశారు. అయితే, డీఎండీకే ఎప్పుడూ పదవులకో, డబ్బులకో ఆశపడే పార్టీ కాదని నమ్ముకున్న సిద్ధాంతాలకు, కూటమి ధర్మానికి కట్టుబడి ఉండే పవిత్రమైన పార్టీ అని స్పష్టం చేశారు.
టీవీకే ప్రభుత్వంపై విమర్శల బాణాలు..
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు మొదలయ్యాయని ప్రేమలత ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీవీకే.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతిభద్రతల క్షీణించాయని, మహిళలపై లైంగిక దాడులు, విద్యుత్ కోతలు, మేఘదాతు వివాదం, రైతుల రుణమాఫీ నిరసనలు పెరిగిపోతున్నాయని, వీటికి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో ఎవరినైతే ’దుష్ట శక్తి’ అని విమర్శించారో, ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో ఇక్కడ ’పవిత్ర శక్తి’ అని చెప్పుకునే వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ఈ రాజకీయ డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
పళనిస్వామి తీరుపై ఫైర్
2024 లోక్సభ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు అండగా డీఎండీకే నిలిచిన విషయాన్ని ప్రేమలత గుర్తుచేశారు. అయితే, 2024లో వదిలేసి వెళ్లిన వారినే మళ్లీ 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం పిలిచి పళని చర్చలు జరిపారని పేర్కొన్నారు. కష్టకాలంలో తోడున్న తమను కనీసం గౌరవించి పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


