సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన డీఎంకే పార్టీలో అంతర్గత పునర్వ్యవస్థీకరణకు కసరత్తులు చేపట్టింది. పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ను ఫలితాలు డీలా పడేలా చేశాయి. తాను సైతం కొళత్తూరులో ఓడినా, ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే నిలవడం కాస్త ఊరటగా మారింది. దీంతో స్టాలిన్ పార్టీలో సమూల మార్పులకు చర్యలు చేపట్టారు.
30 మంది సభ్యుల కమిటీ విచారణ
నియోజకవర్గాల వారీగా ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి డీఎంకే అధినాయకత్వం 30 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే, పార్టీ వలంటీర్లు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా పంచుకోవడానికి ‘ఉడన్ పెరప్పే’ అనే ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఈ కమిటీలు ఇచ్చే నివేదికను జూన్ 10వ తేదీలోగా పార్టీ అధ్యక్షుడికి సమర్పించాల్సి ఉంది.
జిల్లా కమిటీల విభజన
పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం ఉన్న 78 జిల్లాల కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. తద్వారా నియోజకవర్గాల వారీగా పట్టు సాధించవచ్చని భావిస్తున్నారు. యువజనులకు అత్యధికంగా జిల్లాల కార్యదర్శుల పదవులు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పార్టీలోని ఇతర సీనియర్ నేతలలో కె.ఎన్. నెహ్రూ, వేలు మాత్రం ప్రస్తుతానికి తమ పదవుల్లోనే కొనసాగుతారని సమాచారం.
యువతకు చాన్స్
ఎన్నికల నివేదికల ఆధారంగా జూన్ 10 తర్వాత డీఎంకే బైలాస్ (రాజ్యాంగం)ను సవరించి భారీ మార్పులు చేయనున్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా సీనియర్ నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఉన్న దురైమురుగన్న్ను ఆ పదవి నుంచి తప్పించాలని ఎం.కె. స్టాలిన్ నిర్ణయించినట్టు సమాచారం. వయసు పైబడడంతో ఆయన్ను తప్పించి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించనున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆయనను కేవలం ఒక ఉప–కార్యదర్శి పదవికి పరిమితం చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే, మరి కొందరు సీనియర్లను తప్పించనున్నట్టు తెలిసింది. దీంతో, తమిళనాడులో డీఎంకే రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకుంది.


