న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని సంభాల్లో జరిగిన హింసాకాండ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న గ్యాంగ్స్టర్ షారిక్ సతాపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. 2024 నవంబర్ 24న షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా తలెత్తిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ అల్లర్ల వెనుక షారిక్ సతా హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని సంభాల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ తెలిపారు.
గతంలోనే నిందితుడిని పరారీలో ఉన్న నేరస్థుడిగా కోర్టు ప్రకటించడంతో పాటు, అతని ఆస్తుల జప్తు ప్రక్రియను కూడా పోలీసులు చేపట్టారు. అనంతరం సీబీఐ సమన్వయంతో యూపీ పోలీసులు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. దొంగ పాస్పోర్టుతో దుబాయ్ పారిపోయిన సతాపై నిఘా ఉంచి, సమగ్ర నివేదికను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్సీఆర్, యూపీ వ్యాప్తంగా వాహనాల దొంగతనాలతో పాటు సుమారు 55 నుంచి 60 క్రిమినల్ కేసుల్లో షారిక్ సతా నిందితుడిగా ఉన్నాడు. అతనిని విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: రణరంగంగా షిల్లాంగ్: హెల్ప్లైన్ నంబర్లు విడుదల


