న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని భల్సా డైరీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు బృందంపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భల్సా డైరీ పరిధిలో శనివారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో పోలీసు సిబ్బంది సాధారణ గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వాహనాల తనిఖీ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు.
దీంతో ఆగ్రహానికి గురైన వాహన యజమాని, మరికొందరు వ్యక్తులతో కలిసి పోలీసులపై ఒక్కసారిగా దాడికి దిగారు. దుండగులు పోలీసుల కళ్లలో మిరపపొడి చల్లి, చేతుల్లో ఉన్న కర్రలు, ఇనుప రాడ్లు, ఇటుకలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నిందితులు కర్రలు పట్టుకుని పోలీసులను వెంబడించి కొడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో నమోదయ్యాయి. స్థానికంగా పలు నేరాలతో సంబంధం ఉన్న సునీల్ అలియాస్ పంకజ్ అనే రౌడీషీటర్ ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.
ఇతనిపై గతంలోనూ తీవ్రమైన నేరాలతో కూడిన ఐదు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి, ఘటనా స్థలంలో ఉన్న ఒక మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పంకజ్తో పాటు మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్న పోలీసులపై ఇలాంటి దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: ఐఫోన్ ఈఎంఐ కట్టలేక ‘యమున’లో దూకి..


