చెన్నై: తమిళనాడులో వెలుగు చూసిన దారుణమైన హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనుమానిత దంపతులు ఓ మహిళను అతి క్రూరంగా హత్య చేశారు. హత్య తర్వాత ఆ మహిళ శరీర భాగాలను ముక్కలుగా నరికి, అందులో కొంతభాగాన్ని బిర్యానీ పాత్రలో వండారు. ఆ పాత్ర మూతకు గాలి ఆడకుండా మైదా పిండితో సీల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆగ్రా చేరుకున్న తర్వాత ఓ జనరల్ కంపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా ఉన్న ఎరుపు రంగు సూట్కేసు నుండి దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. ఆగ్రా రైల్వే పోలీసులు ఆ సూట్కేసును తెరిచి చూడగా, అందులో తల లేని, ముక్కలుగా నరికిన ఒక మహిళా మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసును సీరియస్గా తీసుకున్న ఆగ్రా రైల్వే పోలీసులు తమిళనాడు పోలీసుల సహాయం కోరారు. చెన్నై సెంట్రల్ స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ పుటేజ్ను పరిశీలించగా కీలక ఆధారాలు లభించాయి. మధ్యవయస్కుడైన వ్యక్తి, మహిళ కలిసి ఎరుపు రంగు సూట్కేసుతో సెంట్రల్ స్టేషన్కు వచ్చి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడం కనిపించింది. ట్రైన్ బయలుదేరే సమయానికి కొద్దిసేపు ముందు వారు ఆ సూట్కేసును లోపల ఉంచి కిందకు దిగిపోయారు. అనంతరం వారు పార్క్ స్టేషన్కు నడిచివెళ్లి, ఈఎంయూ రైలు ఎక్కి గుడువాంచేరిలో దిగి ఆటోలో వెళ్లినట్లు సీసీటీవీ ద్వారా గుర్తించారు.
గుడువాంచేరి పరిసర ప్రాంతాల్లో సుమారు 350లకు పైగా సీసీటీవీ కెమెరాలను విశ్లేషించగా, ఆ జంట గుడువాంచేరిలోని మస్జిద్ వీధిలో ఉన్న ఒక అద్దె ఇంటి నుంచి అదే సూట్కేసుతో బయలుదేరినట్లు తేలింది. గుడువాంచేరి పోలీసుల సహాయంతో ఆ ఇంటిని తనిఖీ చేయగా, అక్కడే హత్య జరిగినట్లు బలమైన ఆధారాలు లభించాయి. ఒడిశాకు చెందిన ముగ్గురు మాణిక్ ఉతిన్ లస్కర్, అతని భార్య భగమతి మాజి, హయత్ నిషా అనే ముగ్గురు నివసిస్తున్నట్లు విచారణలో తేలింది. హత్యకు గురైన మహిళ హయత్ నిషాగా ప్రాథమికంగా గుర్తించారు. ఆమె తాంబరం సమీపంలోని ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తుండగా, ఆమె కుమారుడు ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు.
బాధితుల్ని ఇంట్లోనే హత్య చేసి, ముక్కలుగా నరికారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మిగిలిన శరీర భాగాలతో బిర్యానీ వండిన ఆధారాలు లభ్యమయ్యాయి. బాధితురాలి తల ఎక్కడ పడేశారు. అసలు ఈ హత్య వెనుక ఉన్న అసలు ఉద్దేశం అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


