మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
సాక్షి హైదరాబాద్: మద్యం మత్తులో ద్విచక్రవాహనం నడుపుతూ అదుపు తప్పడంతో కోల్కతాకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఇన్స్పెక్టర్ భూపతి తెలిపిన వివరాల ప్రకారం... కోల్కతాకు చెందిన అబ్బాస్ సిద్ధిఖీ (26) రెండు రోజుల క్రితం నగరంలో జరిగిన ఎక్స్పోకు వచ్చి వెస్టిన్ బంజరాలో ఉంటున్నాడు. అతని స్నేహితులు అభిరూప్ సింగ్ మిరాజ్ (25), సహస్ర చటోపాధ్యాయలతో కలిసి శుక్రవారం సాయంత్రం మాదాపూర్లోని మధుశాల బార్లో మద్యం తాగారు. అర్ధరాత్రి ముగ్గురూ కలిసి చార్మినార్ చూసేందుకు క్యాబ్లో వెళ్లారు.
తెల్లవారుజామున 3 గంటలకు బార్కు తిరిగి వచ్చి పార్కింగ్లో ఉన్న బైక్పై ఖాజాగూడ లేక్ వద్దకు వెళ్లి తిరిగి బయలుదేరారు. చటోపాధ్యాయ మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడుపుతూ ఖాజాగూడ లేక్రోడ్డులో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ వద్ద అదుపు తప్పి ఫుట్పాత్ను ఢీకొట్టాడు. వెనుక కూర్చున్న అబ్బాస్ సిద్ధిఖీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యలో కూర్చున్న అభిరూప్సింగ్ మిరాజ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించడంతో సహస్ర చటోపాధ్యాయ ప్రాణాలు దక్కాయి. వీరి ఇద్దరు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


