పురాతన వ్యవస్థ స్థానంలో 1,700 ఎంఎం పైపులైన్లు
కొత్తగా 232 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇన్టేక్ వెల్
8 డివిజన్ల పరిధిలో శాశ్వత ఉపశమనం
రెండేళ్లలో పనులు పూర్తి చేసేలా టెండర్ల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: మహా నగర భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల ఆధునికీకరణపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. దశాబ్దాల చరిత్రగల ‘మంజీరా నీటి సరఫరా పథకం (ఫేజ్–1, ఫేజ్–2) వ్యవస్థను సమూల పక్షాళన చేసేలా ‘మిషన్ మంజీరా’కు సిద్ధమైంది. దాదాపు 551.07 కోట్ల వ్యయంతో భారీ పునరుద్ధరణ పనులు చేపట్టనుంది. ఈ మేరకు శనివారం టెండర్ ప్రక్రియకు ఉపక్రమించింది.
మంజీరా పైపులైన్ వ్యవస్థలో ఫేజ్–1 (1965), ఫేజ్–2 (1981) ద్వారా ప్రతిరోజూ మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. దశాబ్దాలు గడిచేసరికి 1,500 ఎంఎం డయా సామర్థ్యం కలిగిన ప్రధాన పైపులైన్లు శిథిలమై, నీటి పీడనాన్ని తట్టుకోలేక తరచూ పగిలి పోయి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కలబ్గూర్ టు పటాన్చెరు ప్రధానంగా మంజీరా లీకేజీల సమస్యకు శాశ్వత పరిష్కారంగా కలబ్గూర్ డబ్ల్యూటీపీ నుంచి పటాన్చెరు పంపుహౌస్ వరకు కొత్తగా సుమారు 1,700 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు జలమండలి చర్యలు చేపట్టింది.
అత్యధిక పీడనాన్ని తట్టుకునే సాంకేతికతతో నిర్మించే పైపు లైన్ల ద్వారా సరఫరా సమయంలో జరిగే నీటి నష్టాలు నివారించవచ్చని భావిస్తోంది. పాత పైపులైన్లకు సమాంతరంగా నూతన వ్యవస్థను అనుసంధానించి సాంకేతిక అంతరాయాలు తలెత్తకుండా నీటిని అందించవచ్చని జలమండలి అంచనా వేస్తోంది. కలబ్గూర్ వద్ద రోజువారీగా 232 ఎంఎల్డీ శుదీ్ధకరణ సామర్థ్యం కలిగిన అధునాతన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును నిర్మించనుంది. దీనికి అనుబంధంగా ముడి జలాల నిరంతర సేకరణకు సరికొత్త ‘ఇన్టేక్ వెల్’, పంపింగ్ స్టేషన్లు, పంపు హౌస్లను ఆధునికీకరించనుంది.
తీరనున్న దాహార్తి సమస్య..
మంజీరా (ఫేజ్–1, 2 దశ పునరుద్ధరణ పనులు రెండేళ్లలో పూర్తిలా టెండర్ ప్రక్రియకు జలమండలి ఉపక్రమించింది. ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని 3, 6, 9, 15, 17, 18, 22, 24 తదితర డివిజన్లలోని తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా సనత్నగర్, ఖైరతాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, నాంపల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, ఆర్సీపురం, రాజేంద్రనగర్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు ఐటీ, పారిశ్రామిక ప్రాంతాలకు నిరంతర జల భద్రత చేకూరుతుంది.


