సాక్షి,హన్మకొండ: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. స్థానికంగా నిలిపి ఉంచిన ఒక కారు డిక్కీలో గుర్తుతెలియని ఒక యువతి మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండల కేంద్రంలో గత రెండు రోజులుగా ఓ కారు (రిజిస్ట్రేషన్ నంబర్: TS 03 FF 8094) రోడ్డు పక్కన పార్క్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఆ కారును అక్కడే వదిలేసి వెళ్లారు.
అయితే, శుక్రవారం ఆ కారు నుండి తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా, డిక్కీలో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఒక యువతి మృతదేహం బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగి పనేనా?ఈ ఘటనపై తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు కారు వివరాల ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. సదరు కారు యజమాని సురేందర్ అని, కొన్ని రోజుల క్రితమే వినోద్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ కారును అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ హత్యతో వినోద్కు సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. ఆ యువతి ఎవరు? ఆమెను ఎక్కడ, ఎందుకు హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


