15 ఏళ్లుగా గాలించి.. వృద్ధుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు | Delhi Police Arrests 72 Year Old In Extortion Case After 15 Year Chase | Sakshi
Sakshi News home page

15 ఏళ్లుగా గాలించి.. వృద్ధుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Aug 22 2026 3:40 PM | Updated on Aug 22 2026 3:43 PM

Delhi Police Arrests 72 Year Old In Extortion Case After 15 Year Chase

Representative image

ఓ దోపిడీ కేసులో దాదాపు 15 ఏళ్లుగా పరారీలో ఉన్న 72 ఏళ్ల వృద్ధుడిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అరెస్ట్ చేసింది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన హరి సింగ్ షెఖావత్‌ను 2016లో కోర్టు పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించింది.

ఈ కేసు 2008 నాటిది. తాను పనిచేస్తున్న ప్రముఖ వస్త్రాల బహుళజాతి సంస్థ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు షెఖావత్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షెఖావత్‌పై 2008 మార్చి 15న దోపిడీ, నేరపూరిత బెదిరింపులు, నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన కేసు నమోదైంది. అతను కోర్టుకు హాజరుకాకపోవడంతో పాటు చట్టపరమైన చర్యలకు దూరంగా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో 2016 ఏప్రిల్ 2న అతడిని పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించారు.

అరెస్టును తప్పించుకునేందుకు..
దీర్ఘకాలంగా పరారీలో ఉన్న నేరస్థుల కోసం నిఘా కొనసాగిస్తోందని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం తెలిపింది. షెఖావత్ ఆచూకీ కోసం విస్తృతంగా వ్యక్తిగత నిఘా నిర్వహించినట్లు వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా అరెస్టును, చట్టపరమైన చర్యలను తప్పించుకునేందుకు అతను తొలుత గుజరాత్‌కు, ఆ తర్వాత రాజస్థాన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నెలకు పైగా నిఘా కొనసాగించిన తర్వాత ఆగస్టు 13న షెఖావత్ జైపూర్‌లో దాక్కున్నట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది.

సబ్‌ఇన్‌స్పెక్టర్ రాకేశ్ నేతృత్వంలో ఎస్‌ఐ విశాల్ తివారీ, హెడ్ కానిస్టేబుళ్లు నవీన్ చిల్లర్, నవీన్ శర్మ, కుల్దీప్‌తో కూడిన ప్రత్యేక బృందాన్ని జైపూర్‌కు పంపించారు. బృందం గాలింపు చేపట్టి చివరకు నగరంలోని ఓ నివాస సముదాయంలో షెఖావత్ ఆచూకీ గుర్తించింది. అతడి గుర్తింపు, నివాసాన్ని నిర్ధారించిన తర్వాత చట్ట ప్రకారం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

పలు బహుళజాతి సంస్థల్లో పనిచేసిన నిందితుడు
షెఖావత్ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో, గతంలో జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్‌గా పిలిచే సంస్థలో చదువు పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. పలు బహుళజాతి సంస్థల్లో ఉన్నత స్థాయి పదవుల్లో పనిచేసినట్లు వెల్లడించారు. 2008లో ఓ వస్త్రాల బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న సమయంలో ఆ సంస్థ నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసేందుకు అతను ప్రయత్నించినట్లు ప్రత్యేక విభాగం తెలిపింది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, రాజస్థాన్‌లో అతడి కదలికలను గుర్తిస్తూ సాగిన సుదీర్ఘ అంతర్రాష్ట్ర గాలింపునకు అతడి అరెస్టుతో ముగింపు పడిందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: బుర్ఖాలో అక్కడికి పురుషుడు.. ఎలా గుర్తుపట్టారంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement