ప్రధాని మోదీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ సంస్కరణలు చేపట్టడం తన ప్రభుత్వ లక్ష్యమని, వృద్ధి వేగాన్ని నిలకడగా కొనసాగించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశంలో రాజకీయ స్థిరత్వం, ప్రభుత్వ విధానాల్లో కొనసాగింపు ఉన్నాయని చెప్పారు.
ప్రపంచం భారత్ను ఒక ఆశాకిరణంగా చూస్తోందని పేర్కొన్నారు. వనరులను ఆయుధాలుగా మారుస్తుండటంతో వృద్ధికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అనేక ఆందోళనలు ఉన్నప్పటికీ, భారత్ మాత్రం వృద్ధికి సంబంధించి ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందని స్పష్టంచేశారు. సంస్కరణల విషయంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఒక స్పష్టమైన రోడ్మ్యాప్ ఉందన్నారు. తమ ప్రభుత్వం అధిక ఉత్పత్తికి ప్రోత్సాహకాలతో తగిన గుర్తింపునిస్తోందని వివరించారు.
ప్రజలను కొరతలో ఉంచి, కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వం ముందు వేడుకునేలా చేయడం గత ప్రభుత్వాల విధానమని నరేంద్ర మోదీ ఆరోపించారు. గత ప్రభుత్వాల లైసెన్స్ రాజ్ విధానం నిరుద్యోగ భారాన్ని పెంచేదిగా ఉండేదని గుర్తుచేశారు. కానీ తన ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానంతో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని వెల్లడించారు. తాము కేవలం నిబంధనలను మాత్రమే మార్చడం లేదని, నిబంధనలకు సంబంధించిన మొత్తం విధానాన్నే మారుస్తున్నామని వివరించారు.


