ఏసీల్లాంటివి లేకుండానే ఇల్లు చల్లగా ఉంటే భలే బాగుంటుంది కదా? కొంచెం ఖర్చు, శ్రమకోరిస్తే ఇందుకు ఎన్నో మార్గాలు న్నాయి కానీ... పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్ర వేత్తలు తాజాగా ఇంకో సరికొత్త మార్గాన్ని ఆవిష్క రించారు. అడవి ఏనుగుల ను స్ఫూర్తిగా తీసుకుని వాటి చర్మాలను పోలిన సిమెంట్ టైల్స్ తయారు చేశారు వీరు. బయటి గోడలకు వీటిని వాడితే ఇంటిలోపల ఉష్ణోగ్రతలు 6 నుంచి 11 డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గుతాయని పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది కూడా.
ఆసక్తికరమైన ఈ పరిశోధన వివరాలు... ఆఫ్రికాలోని ఏనుగులు మటమటలాడే ఎండల్లోనూ భేషుగ్గా బతికేయగలవు. ఏనుగు చర్మం మందంగా ఉండటం ఒక్కటే కారణం కాదు. చర్మం పైభాగంలో ఉండే పగుళ్లలో నీరు చేరిపోయి... నెమ్మదిగా ఆవిరవుతూ చల్లదనం అందిస్తుంది. ఇదే విషయాన్ని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు భవన నిర్మాణ సామగిర తయారీకి వాడారు.
సిమెంట్, డైఆటమేషియస్ మట్టి (కీటకనాశినులుగా చల్లే తెల్లటి పొడిలాంటి మట్టి) సాయంతో పలకల్లాంటివి తయారు చేశారు. వీటిలోనూ పగుళ్లు ఉంటాయి. కాకపోతే అవి ఎలా ఉండాలన్నది మనం నిర్ణయించవచ్చు. ఇలా చేయడం వల్ల వాటిల్లోకి నీరు చేరడమే కాకుండా... ఉపరితలం మొత్తమ్మీద నెమ్మదిగా వ్యాపిస్తుంది కూడా. ఎండ వేడికి ఈ నీరు నెమ్మదిగా ఆవిరవుతూ వేడిని విడుదల చేస్తుంది. తద్వారా లోపలి ప్రాంతం చల్లగా మారుతుంది.
శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల్లో ఈ టైల్స్ దిగువన ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటే, పగుళ్లు ఉన్న టైల్స్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగానూ, పగుళ్లు లేని టైల్స్ ఉపరితలంపై ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్గానూ ఉన్నట్లు తెలిసింది. పగుళ్లు లేని టైల్స్లో ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే.. ఉన్నదాంట్లోని నీరు కారణంగా ఉష్ణోగ్రత పది డిగ్రీ సెల్సియస్ తక్కువగా ఉందన్నమాట.
పైగా ఈ చల్లదనం దాదాపు 20 గంటలపాటు అలాగే ఉండటం విశేషం. ఈ రకమైన టైల్స్ వాడితే ఇంటి లోపలి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి ఏసీ, కూలర్ల వంటివాటి వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడల్లా ఈ టైల్స్పైకి ఆటోమెటిక్గా నీరు చిమ్మేలా ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రయోగం ప్రాముఖ్యత ఏమిటంటే...
భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎండాకాలం వేడి ఏటికేడు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతోపాటే ఏసీల వాడకం.. ఫలితంగా విద్యుత్తు వినియోగం కూడా కొండెక్కుతోంది. ఈ ఏడాది మే నెల వరకూ భారత్లో సుమారు కోటీ యాభై లక్షల ఏసీలు అమ్ముడుపోయినట్లు సమాచారం. వడగాడ్పులు, రుతుపవనాల ఆలస్యం వంటి కారణాలతో ఏసీలు ఎక్కువగా వాడటం వల్ల మే నెలలోనే దేశ గరిష్ట విద్యుత్తు వినియోగం 22 గిగావాట్లకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌక పద్ధతుల్లో ఇళ్లలో చల్లదనాన్ని అందించే ఏర్పాట్లు ఎంతైనా ఆహ్వానించదగ్గవి.
– సాక్షి, నేషనల్ డెస్క్


