న్యూఢిల్లీ: విధాన రూపకల్పనలో నూతన అంశాలను జోడించడానికి ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మరింత సమన్వయం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. అదే సమయంలో మానవ మేధస్సు, విచక్షణను విస్మరించకూడదని అన్నారు. దేశ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనే దానిపై దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. డేటాను జాతీయ సంపదగా అభివర్ణించారు.
వివిధ ప్రయోజనాల కోసం డేటాను సేకరించి, నిర్వహించే విధానాలలో తేడాలు ఉన్నాయని తెలిపారు. అలాగే, డేటా మధ్య మరింత అనుసంధానతను, దాని సమర్థవంతమైన వినియోగాన్ని సాధ్యం చేసే పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. విడివిడిగా పనిచేయడం అనేది కేవలం సంస్థాగత సమస్య మాత్రమే కాదని, అది ఒక ఆలోచనా విధాన సమస్య అని అన్నారు. అధికారులు ఐకమత్య స్ఫూర్తితో పనిచేయాలని ప్రధాని స్పష్టం చేశారు. జట్టు స్ఫూర్తిని పెంపొందించుకోవడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన, ప్రపంచ స్థాయిలో దానిని మరింత పోటీతత్వంతో కూడినదిగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.


