మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో కొండపై జరిగిన విషాద ఘటనలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల మీద అలిగిన కుమారుడు కొండ మీద నుంచి దూకుతానంటూ వెళ్లగా.. తన కుమారుడిని కాపాడుకునేందుకు వెళ్లిన తండ్రి కూడా మరణించాడు. వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. క్షణాల్లో మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
మరణించిన 18 ఏళ్ల కునాల్ చాంద్వాడే, అతని తల్లి సంగీత చాంద్వాడేకు సంబంధించిన రెండు తేదీ లేని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓ వీడియోలో కునాల్ తన తల్లితో కలిసి టీ తాగుతూ కనిపించగా.. మరో వీడియోలో అతను తన తల్లి కాళ్లు కడిగి ఆమె ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించాడు.
ఐ ఫోన్ విషయంలో జరిగిన గొడవ విషాదంగా మారగా.. కునాల్, సంగీత, అతని తండ్రి మురళీధర్ చాంద్గుడే మరణించారు. కుమారుడు కునాల్ ఐఫోన్ కొనుగోలు చేసి.. దాని ఈఎంఐలు చెల్లించేందుకు కుటుంబ సభ్యులను డబ్బులు అడిగాడు.. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో గొడవ జరిగింది. కుమారుడు కునాల్ పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన మురళీధర్, సంగీతతో పాటు మరికొందరు స్థానికులు కొండపైకి వెళ్లి అతనితో మాట్లాడి ఇంటికి తిరిగి రావాలని ఒప్పించేందుకు ప్రయత్నించారు.
ఇదీ చదవండి: నీ తల్లి కోసమైనా బతకాల్సింది కదరా!
దాదాపు మూడు గంటల తర్వాత, మురళీధర్ కునాల్ ఉన్న ప్రదేశానికి చేరుకుని అతన్ని అంచు నుంచి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ అదుపుతప్పి సుమారు 250 అడుగుల లోతైన లోయలో పడిపోయారు. తన భర్త, కుమారుడు కిందపడటాన్ని చూసిన సంగీత తట్టుకోలేక కొన్ని సెకన్ల తర్వాత తాను కూడా దూకింది. నగరంలోని జల్తా ఫాటా ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.


