మహిళలు పురుషుడి అధికారం కిందే ఉండాలా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం
మహిళలే దేశానికి అతిపెద్ద ఆస్తి అని వెల్లడి
పుణె: మహిళలు తమ తండ్రులు, భర్తలు లేదా కుమారులకు చెందినవారు కాదని.. తమకు తామే చెందినవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ఒక మహిళ తన జీవితంలో ప్రతి దశలోనూ పురుషుడి అధికారం కింద ఉండాలన్న మనుస్మృతి నిబంధన సిగ్గుచేటు అని ఆక్షేపించారు. భారతదేశపు అతిపెద్ద బలం ఇక్కడి మహిళల 70 కోట్ల విశిష్ట ప్రయాణాలు, విశిష్ట ఊహలు, విశిష్ట కలలు అని అభివర్ణించారు.
మహారాష్ట్రలోని పుణేలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చాత్రోంకీ గూంజ్’కార్యక్రమంలో యువతులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. మహిళలు బాల్యంలో తండ్రికి లోబడి ఉండాలని, యవ్వనంలో భర్తకు చెందాలని, భర్త మరణించిన తర్వాత ఆమె తన కుమారుల అ«దీనంలో ఉండాలని, స్త్రీ ఎన్నడూ స్వతంత్రంగా ఉండకూడదని మనుస్మృతి చెబుతోందని గుర్తుచేశారు. ఇలా చెప్పడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. మహిళలు ఈ దేశానికి అతిపెద్ద ఆస్తి అని, వారు తమ కోసం తాము నిలబడాలని, తమను తాము విశ్వసించాలని చెప్పారు. ‘‘మీరు మీకు తప్ప మరెవరికీ చెందినవారు కాదు.
మీకు మీ తండ్రి, సోదరుడు, భర్త, కొడుకుతో సంబంధం ఉండవచ్చు. కానీ మీరు వారికి చెందినవారు కాదు, మీరు మీకు మాత్రమే చెందినవారు’’అని మహిళలను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. ఉపన్యాసాలు ఇవ్వడానికో, రాజకీయాల గురించి చర్చించడానికో కాకుండా.. యువత తమ భావాలను వ్యక్తపరచడానికి, వారి ఆలోచనలను చర్చించుకోవడానికి అవకాశం కల్పించడానికే ఇక్కడికి వచ్చానని అన్నారు. సంకెళ్లను బద్దలు కొట్టండి అంటూ పిలుపునిచ్చారు.
ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనవాడని, వారికి వారి సొంత కలలు, ఆశయాలు ఉంటాయని చెప్పారు. పురుషుల కంటే మహిళలు స్వభావరీత్యా ఎక్కువ సున్నిత మనస్కులు, సౌమ్యులు, కరుణామయులు, దూరదృష్టి కలవారని తెలిపారు. అందుకే వారు మన దేశానికి అసలైన సంపద అని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. మహిళలు తరచుగా కుమార్తె, భార్య లేదా తల్లి అనే మూడు గుర్తింపులకే పరిమితమవుతున్నారని, ఈ సంబంధాలలో తప్పేమీ లేనప్పటికీ, అవే వారి ఏకైక గుర్తింపుగా ఉండకూడదని తేల్చిచెప్పారు.
నన్ను పిలవండి.. నిరసనలో కూర్చుంటా
హాస్టల్లో విద్యార్థులకు సౌకర్యాలు లేవని, భద్రత కూడా కల్పించడం లేదని ‘ఛాత్రోంకీ గూంజ్’లో ఓ గిరిజన యువతి రాహుల్ గాం«దీ దృష్టికి తీసుకొచ్చారు. డిమాండ్ల పరిష్కారం కోసం పుణేలోని మంజరిలో గిరిజన విద్యార్థులు గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఈ నిరసనలో ఇద్దరు అమ్మాయిలు కూడా పాల్గొంటున్నారని, వారిలో ఒకరి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు.
దీనిపై ఆయన స్పందిస్తూ... సమస్యల పరిష్కారం కోసం పుణేలో నిరసన వ్యక్తంచేస్తున్న గిరిజన విద్యార్థులకు అండగా ఉంటానని, తాను కూడా నిరసనలో పాల్గొంటానని చెప్పారు. ‘‘నన్ను పిలవండి.. నేను వచ్చి మీతోపాటు నిరసనలో కూర్చుంటాను’’అని పేర్కొన్నారు. విద్యావకాశాలు, ఆర్థిక స్వాతంత్య్రం, ప్రజా రవాణా భద్రత, హింస, సైబర్ వేధింపులతో సహా పలు అంశాలపై విద్యారి్థనులతో సంభాíÙంచారు.


