పార్లమెంట్ సమావేశాల్లో ఏడాదిగా ఇదే ఒరవడి
పీఆర్ఎస్ విశ్లేషణలో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల్లో ఎక్కువ శాతం సంబంధిత సెషన్లోనే ఆమోదం పొందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 18వ లోక్సభలో ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లుల్లో సగానికి పైగా అదే సెషన్లో ఆమోదం పొందాయి. గత ఏడాది కాలంలో ఈ ఒరవడి ఒక్కసారిగా పెరిగిందని లాభాపేక్ష లేని స్వతంత్ర సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ విశ్లేషించింది. ఈ లోక్సభలో 64 బిల్లులను ప్రవేశపెట్టగా 34, అంటే 53 శాతం బిల్లులకు ప్రవేశపెట్టిన సెషన్లోనే ఉభయ సభలు ఆమోద ముద్ర వేశాయని తెలిపింది. 16వ లోక్సభలో 189 బిల్లుల్ని ప్రవేశపెట్టగా 63 మాత్రమే, అంటే 33 శాతం బిల్లులు మాత్రమే గట్టెక్కాయి. ఆ తర్వాత 17వ లోక్సభకు వచ్చేసరికి ఈ ట్రెండ్లో ఒక్కసారిగా మార్పు కనిపించింది.
ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన మొత్తం 190 బిల్లులకు గాను ఏకంగా 117 బిల్లులు, అంటే 62 శాతం వరకు అదే సెషన్లో ఆమోదం పొందాయని పీఆర్ఎస్ డేటా వెల్లడించింది. పీఆర్ఎస్ సంస్థ పార్లమెంట్తోపాటు రాష్ట్రాల శాసనసభ పనితీరును అంచనా వేస్తుంటుంది. 2026 బడ్జెట్ సెషన్లో ఉభయసభల ముందుకు తీసుకువచ్చిన 10 బిల్లులకు గాను ఐదు బిల్లులు అదే సెషన్లో ఆమోదం పొందాయని తెలిపింది. ఆగస్ట్ 13వ తేదీతో ముగిసిన వర్షాకాల సమావేశాల్లో ఈ వైఖరి మరింత ప్రస్ఫుటమైంది. ప్రవేశపెట్టిన 12 బిల్లులకు గాను 11 బిల్లులు సెషన్ పూర్తయ్యేలోపే ఆమోదం పొందాయని పీఆర్ఎస్ వివరించింది.
అసలు ఎజెండాలోనే లేని 11 బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆరింటిని నెగ్గించుకుందని కూడా తెలిపింది. వీటిలో వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్(వీబీఎస్)బిల్లు–2025, విదేశీ విరాళాల(నియంత్రణ) (ఎఫ్ఆర్సీఏ)బిల్లులు ఉన్నాయని తెలిపింది. ఇందులో వీబీఎస్ఏ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ నివేదిక ఇంకా ఇవ్వనే లేదని, అదేవిధంగా, ఎఫ్ఆర్సీఏ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించారని వెల్లడించింది. పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని కూడా పీఆర్ఎస్ పేర్కొంది.


