న్యూఢిల్లీ: ఎముకల దృఢత్వానికి, కాల్షియం శోషణకు(గ్రహించే ప్రక్రియకు), రోగనిరోధక శక్తిని పెంచడానికి శరీరానికి విటమిన్-డి ఎంతో అవసరం. శరీరానికి సూర్యరశ్మి తగిలినప్పుడు ఇది సహజంగా ఉత్పత్తి అయినప్పటికీ, ప్రస్తుత రోజుల్లో చాలామందిలో విటమిన్-డి లోపం కనిపిస్తున్నది. దీంతో వైద్యులు సప్లిమెంట్లను సూచిస్తున్నారు.
అయితే కేవలం విటమిన్-డి తీసుకోవడమే కాకుండా, శరీరం దానిని సమర్థవంతంగా గ్రహించేలా సరైన సమయంలో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఢిల్లీ ఎయిమ్స్ పూర్వ విద్యార్థిని గురుగ్రామ్లోని ‘ది న్యూరోమెడ్ క్లినిక్’ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ విటమిన్-డి సప్లిమెంట్ల శోషణపై కీలక సూచనలు చేశారు. విటమిన్-డి కొవ్వులో కరిగే (ఫ్యాట్-సాల్యుబుల్) విటమిన్ అని డాక్టర్ ప్రియాంక వివరించారు. మన పేగుల్లో కొవ్వు ఉన్నప్పుడే ఇది శరీరానికి గరిష్ఠ స్థాయిలో అందుతుంది. మార్కెట్లో ఇవి క్యాప్సూల్స్, సిరప్స్, డ్రాప్స్, పౌడర్ రూపంలో (సాచెట్స్) లభిస్తాయి.
తీసుకోవాల్సిన సరైన సమయం
రోజులో ఎక్కువ ఆహారం తీసుకునే సమయంలోనే విటమిన్-డి సప్లిమెంట్లను తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు. అది ఉదయం అల్పాహారం కావొచ్చు లేదా మధ్యాహ్న భోజనం కావొచ్చు. భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండిపదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
నీళ్లతో కాకుండా పాలతో..
పౌడర్ రూపంలో ఉండే విటమిన్-డి సాచెట్లను నీటిలో కలుపుకొని తాగడం మంచిది కాదని ఆమె స్పష్టం చేశారు. పౌడర్ను ఒక గ్లాసు పాలతో కలిపి తీసుకోవాలని సూచించారు. పాలలో ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు కాల్షియం కూడా ఉంటుంది. శరీరంలో తగినంత విటమిన్-డి ఉంటే ఎముకలు కాల్షియాన్ని గ్రహిస్తాయి. అదేవిధంగా కాల్షియం సమృద్ధిగా ఉంటే విటమిన్-డి శోషణ కూడా మెరుగవుతుంది. అందుకే సాచెట్లను పాలతో తీసుకోవడం, భోజనం తర్వాత సప్లిమెంట్లను వేసుకోవడం అత్యుత్తమమని డాక్టర్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తున్నదంటే..


