మీరట్: కటకటాల వెనుక బందీగా జీవితం గడుపుతున్న ఖైదీల భావోద్వేగాలకు ‘రేడియో పర్వాజ్’ వేదికగా నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా జైలులో మే 8న ప్రారంభమైన ఈ ప్రత్యేక అంతర్గత రేడియో స్టేషన్లో వినిపిస్తున్న ఆ పాత మధుర సినీ గీతాలకు విశేష స్పందన లభిస్తున్నది. ముఖ్యంగా ప్రేమ, వియోగం, అవిశ్వాసం, భక్తికి సంబంధించిన పాటలను ప్రసారం చేయాలని ఖైదీలు అభ్యర్థిస్తున్నారు.
జైలు యంత్రాంగం స్థలాన్ని సమకూర్చగా, ‘ఇండియా విజన్ ఫౌండేషన్’ ఈ రేడియో వ్యవస్థను తీర్చిదిద్దింది. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు ఈ ప్రసారాలు సాగుతాయి. ఖైదీలు తమకు నచ్చిన పాటను ఒక రోజు ముందుగానే చీటీ రూపంలో అందజేస్తారు. అయితే ఖైదీల పేర్లను గోప్యంగా ఉంచి, కేవలం బ్యారక్ నంబర్ను మాత్రమే ప్రస్తావిస్తారు. 1970, 80, 90ల నాటి గీతాలకు అధిక డిమాండ్ ఉంటోంది. పురుష ఖైదీలు ప్రేమ, విరహ గీతాలు, భక్తి పాటలు కోరుకుంటుండగా, మహిళా ఖైదీలు అనురాగం, కుటుంబం, పిల్లల గురించిన పాటలను ఎంపిక చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ జైలులో 1,900 మంది పురుషులు, 63 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. సంగీతం ఖైదీలలో మానసిక ఒత్తిడిని తగ్గించి, వారి ప్రవర్తనలో సానుకూల మార్పు తెస్తోందని జైలు సూపరిండెంట్ డాక్టర్ విరేశ్ రాజ్ శర్మ తెలిపారు. ఖైదీల బ్యారక్లలో స్పీకర్లు, ఆధునిక మిక్సర్లు అమర్చారు. ఇండియా విజన్ ఫౌండేషన్ శిక్షణ పొందిన ఓ ఖైదీ స్వయంగా రేడియో జాకీగా వ్యవహరిస్తుండగా, ఆసక్తి ఉన్న ఖైదీలు స్టూడియోలో స్వయంగా పాడే వెసులుబాటు కూడా కల్పించారు. యూపీలోని ఆగ్రా, ఘజియాబాద్, వారణాసి, లక్నో సహా మొత్తం 11 జైళ్లలో ప్రస్తుతం ఈ ‘రేడియో పర్వాజ్’ కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే పీఏ కుమార్తె అనుమానాస్పద మృతి


