బెంగాలీ చమ్ చమ్
కావలసినవి..
ఛెనా తయారీకి– చిక్కటి పాలు: 1 లీటరు, నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్: టీస్పూన్, పాకం కోసం– పంచదార: ఒకటిన్నర కప్పులు, నీళ్ళు: 4 కప్పులు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, కుంకుమపువ్వు: కొన్ని రేకలు, స్టఫింగ్ కోసం: కోవా (3–4 టేబుల్ స్పూన్లు), డ్రైఫ్రూట్స్: పిస్తా, బాదం ముక్కలు, ఎండు కొబ్బరి పొడి, ఫుడ్ కలర్: 2 చుక్కలు.
తయారీ..
ముందుగా పాలను ఒక గిన్నెలో పోసి బాగా మరిగించండి. పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపి, 2 నిమిషాలు చల్లారాక అందులో నీటిలో కలిపిన నిమ్మరసాన్ని కొద్దికొద్దిగా వేస్తూ పాలు విరిగేలా తిప్పాలి. పాలు, నీరు వేరయ్యాక, ఒక పలచని కాటన్ క్లాత్లో వడకట్టి, వెంటనే చల్లని నీటితో కడిగి నీరంతా పోయేలా 30 నిమిషాల పాటు వేలాడదీయాలి. ఇప్పుడు ఈ ఛెనాని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి అరచేతితో మెత్తగా ఒత్తాలి. రంగు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని సమానమైన భాగాలుగా చేసుకుని పగుళ్లు లేకుండా కోలగా ఒత్తుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి పాత్రలో చక్కెర, 4 కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. చక్కెర కరిగిన తర్వాత పాకం బాగా మరుగుతున్నప్పుడు, తయారుచేసి పెట్టుకున్న ఛెనా రోల్స్ను ఒక్కొక్కటిగా నెమ్మదిగా అందులో వేయాలి.
ఇవి 15–20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్పై ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత పాకం నుంచి చమ్ చమ్లను బయటకు తీసి మధ్యలో చిన్నగా గాటు పెట్టాలి. అందులో కొద్దిగా కోవా నింపాలి. చివరిగా ఎండు కొబ్బరి పొడిలో వీటిని దొర్లించి, పైన పిస్తా, బాదం ముక్కలతో అలంకరిస్తే ఎంతో రుచికరమైన బెంగాలీ చమ్ చమ్ సిద్ధం!
బనారసీ పాన్ ఫడ్జ్
కావలసినవి..
ఫడ్జ్ బేస్ కోసం– వైట్ చాక్లెట్: 400 గ్రాములు, స్వీటెండ్ కండెన్స్డ్ మిల్క్: 1 కప్పు, వెన్న: 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ ఫుడ్ కలర్: 2 చుక్కలు, తాజా తమలపాకులు: 8, పాన్ మసాలా (ఫ్లేవర్ కోసం), గుల్కంద్: 3 టేబుల్ స్పూన్లు, స్వీట్ సోంప్: 2 టేబుల్ స్పూన్లు, టూటీ ఫ్రూటీ: 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి: 2 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, పాన్ ఎసెన్స్: కొన్ని చుక్కలు, గార్నిషింగ్ కోసం: సన్నగా తరిగిన పిస్తా, బాదం, ఎండిన గులాబీ రేకులు, సిల్వర్ ఫాయిల్.
తయారీ..
ముందుగా ఒక పాత్రలో పార్చ్మెంట్ పేపర్ను తీసుకుని దానికి కొద్దిగా వెన్నపూసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్పేస్ట్ కోసం బ్లెండర్లో తమలపాకులతో పాటు కండెన్స్డ్ మిల్క్ పోసి, మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, దానిపై వేడి తగిలేలా మరొక గిన్నెను ఉంచండి. అందులో తురిమిన వైట్ చాక్లెట్, వెన్న, తయారుచేసి పెట్టుకున్న తమలపాకు–కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని వేయండి. చాక్లెట్ పూర్తిగా కరిగే వరకు కలపండి.
ఈ మిశ్రమంలోనే ఒక చుక్క గ్రీన్ కలర్, పాన్ ఎసెన్స్ కలపవచ్చు. తరువాత స్టవ్ ఆపి, ఆ మిశ్రమంలో గుల్కంద్, స్వీట్ సోంపు, టూటీ ఫ్రూటీ, ఎండు కొబ్బరి పొడి, ఏలకుల పొడి వేసి బాగా కలపండి. ఇపుడు సిద్ధంగా ఉన్న ట్రేలోకి ఈ మిశ్రమాన్ని పోసి, గరిటెతో సమంగా ఒత్తుకొని.. పైన తరిగిన పిస్తా, గులాబీ రేకులు, టూటీ ఫ్రూటీ, సిల్వర్ ఫాయిల్తో అందంగా అలంకరించండి.
ఈ ట్రేని 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిజ్లో ఉంచి.. ఫడ్జ్ బాగా గట్టిపడిన తర్వాత, పేపర్ సాయంతో బయటకు తీసి, వేడి నీటిలో ముంచి తుడిచిన పదునైన చాక్తో చిన్న చిన్న చతురస్రాకార ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే బనారసీ పాన్ ఫడ్జ్ సిద్ధం. దీనిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్లో పెడితే 2 వారాల వరకు తాజాగా ఉంటుంది.
ఫిర్నీ
కావలసినవి..
బాస్మతీ బియ్యం: 3 టేబుల్ స్పూన్లు, చిక్కటి పాలు: 1 లీటరు, పంచదార: 1/2 కప్పు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, కుంకుమపువ్వు: 10–12 రేకలు (పాలలో నానబెట్టినవి), రోజ్ వాటర్: టీస్పూన్, డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, పిస్తా ముక్కలు
తయారీ..
30 నిమిషాల పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని పూర్తిగా వడకట్టి, నీళ్లు కలపకుండా మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక మందపాటి పాత్రలో లీటరు పాలు పోసి మీడియం ఫ్లేమ్పై మరిగించి.. పాలు ఒక పొంగు వచ్చాక.. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వను అందులో వేయాలి. సన్నని మంటపై మిశ్రమం చిక్కగయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి.
బియ్యం రవ్వ పూర్తిగా మెత్తగా ఉడికి, పాలు చిక్కగా అయ్యాక అందులో పంచదార, నానబెట్టిన కుంకుమపువ్వు పాలు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. పంచదార కరిగే వరకు మరో 5 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆపేసి, అందులో రోజ్వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన ఫిర్నీని మట్టి గ్లాసులలో లేదా గాజు బౌల్స్లో పోసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలతో అలంకరించాలి. దీనిని కనీసం 2–3 గంటల పాటు ఫ్రిజ్లో ఉంచి, బాగా కూల్ అయిన తర్వాత తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
(చదవండి: హై‘టెక్’ రాఖీ..! చూడ్డానికి చిన్నవే..సర్ప్రైజ్లో మాత్రం..)


