నౌకా నిర్మాణ రంగంలో ముందడుగు వేయాలి
రక్షణ మంత్రి రాజ్నాథ్ పిలుపు
కోల్కతా: ప్రపంచ నౌకా నిర్మాణ కేంద్రంగా అగ్రస్థానానికి చేరుకోగల సామర్థ్యం భారత్కు ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. విదేశాల్లో నౌకా నిర్మాణ పరిశ్రమలో శూన్యత ఏర్పడుతోందని, ఈ పరిస్థితిని మనం సది్వనియోగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆదివారం గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన రూ.3,500 కోట్ల విలువైన ఐదు విస్తరణ ప్రాజెక్టులకు రాజ్నాథ్ సింగ్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం కోల్కతాలో జరిగిన సభలో రాజ్నాథ్ ప్రసంగించారు.
ఓడల నిర్మాణ సాంకేతికతలో వేగవంతమైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు. సంప్రదాయ తయారీదారులైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ నెమ్మదిగా ఉత్పత్తిని తగ్గిస్తున్నాయని, ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంటే షిప్ బిల్డింగ్లో ప్రపంచస్థాయిలో అగ్రస్థానానికి చేరడం తథ్యమని స్పష్టంచేశారు. డిజైన్, తయారీలతోపాటు నిర్వహణ, రిపేర్లు, ఓవర్హాల్(ఎంఆర్ఓ) రంగాల్లో భారత్ తన సత్తా చాటాలని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. దేశంలో పెద్ద సంఖ్యలో కార్మిక బలం, ఉక్కు కంపెనీలు, కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారే సంకల్పశక్తి ఉన్నాయని వివరించారు.
అభివృద్ధి కోసమే అధికార మార్పు..
అభివృద్ధిలో నూతన పునరుజ్జీవనాన్ని తీసుకురావడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాజ్నాథ్ ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే బెంగాల్లో అధికార మార్పు చోటుచేసుకుందని పేర్కొన్నారు. బెంగాల్లో ఫ్యాక్టరీల మూసివేతలు, లాకౌట్ల వార్తల స్థానంలో ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల వార్తలు కనిపిస్తున్నాయని హర్షం వ్యక్తంచేశారు.


