భారత అంతరిక్ష సంస్థ ''ఇస్రో''కు 2026లో ఇప్పటివరకు విజయవంతమైన ప్రయోగం నమోదు కాలేదు. ప్రస్తుతం తన చరిత్రలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన గగన్యాన్ కోసం సిద్ధమవుతోంది. భారత వ్యోమగాములను భారత అంతరిక్ష నౌకలో కక్ష్యలోకి పంపే దిశగా తొలి అడుగుగా నిలిచే గగన్యాన్ మానవ రహిత ప్రయోగాన్ని వచ్చే 4 నెలల్లో చేపట్టే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ప్రకటించారు.
అహ్మదాబాద్లో జరిగిన 3వ జాతీయ అంతరిక్ష వేడుకల్లో మాట్లాడిన డాక్టర్ నారాయణన్.. సైకిళ్లు, ఎద్దుల బండ్లపై రాకెట్ భాగాలను తరలించి ప్రయోగాలు ప్రారంభించిన భారత్.. చంద్రుడు, శుక్రుడు, అంతకు మించిన లక్ష్యాలతో అంతరిక్ష శక్తిగా ఎదిగిన తీరును వివరించారు.
“మనం తుది దశలో ఉన్నాం. ఇప్పటివరకు 8,000 పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాం. ఇప్పుడు తుది దశలో ఉన్నాం. ముందుగా 3 మానవ రహిత ప్రయోగాలు, ఆ తర్వాత మానవ సహిత ప్రయోగం చేపట్టాలి. ఈ ఏడాది తొలి మానవ రహిత ప్రయోగం జరగబోతోందని తెలియజేస్తున్నాను” అని డాక్టర్ నారాయణన్ తెలిపారు.
గగన్యాన్ భారతదేశం చేపడుతున్న అత్యంత క్లిష్టమైన సాంకేతిక ప్రాజెక్టుల్లో ఒకటి. మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు అనువైన రాకెట్ తయారీ, వ్యోమగాముల మాడ్యూల్, జీవనాధార వ్యవస్థలు అభివృద్ధి చేయడం, వ్యోమగాములు సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడటం అత్యంత విశ్వసనీయతను కోరుకుంటాయి. అంతరిక్షంలో భారత్కు శాశ్వత ఉనికి ఏర్పాటుకు ఈ ప్రాజెక్టును తొలి మెట్టుగా భావిస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 12 ఉపగ్రహాలు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇస్రో చైర్మన్ భారీ ప్రణాళికను వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 12 ఉపగ్రహాలను రూపొందించాలని, 8 ప్రయోగ వాహక ప్రయోగాలను చేపట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగాలు సమాచార ప్రసారం, నావిగేషన్, భూ పరిశీలన, శాస్త్రీయ పరిశోధనలకు తోడ్పడటంతో పాటు భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణం, అంతరిక్ష అన్వేషణ కార్యక్రమాలకు పునాది వేయనున్నాయి.
భారత ప్రధాన ప్రయోగ వాహక రాకెట్ పీఎస్ఎల్వీ ప్రస్తుతం నిలిచిపోయింది. వరుసగా 2 సార్లు విఫలమైన ఈ రాకెట్పై మరిన్ని భూ పరీక్షలు పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం ప్రయోగాలను నిలిపివేసింది. భారత్కు అంతరిక్ష అవసరాలు భారీగా పెరిగాయని, రాబోయే రోజుల్లో మరింత పెద్ద సామర్థ్యాలు అవసరమవుతాయని డాక్టర్ నారాయణన్ తెలిపారు.
“ఈ రోజు 64 ఏళ్ల అంతరిక్ష కార్యక్రమం తర్వాత మన వద్ద 56 అంతరిక్ష ఆస్తులు ఉన్నాయి. కానీ దేశానికి ఐదేళ్ల వ్యవధిలో కనీసం 200 నుంచి 300 ఉపగ్రహాలు అవసరం” అని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగం ఒక్కటే ఈ స్థాయిలో ఉపగ్రహాలను అందించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. సమాచార ప్రసారం, భూ పరిశీలన, వాతావరణ అంచనాలు, నావిగేషన్, భద్రతా అవసరాలకు విస్తృతంగా ప్రైవేట్ పరిశ్రమలు, అంకుర సంస్థల భాగస్వామ్యం అవసరమని చెప్పారు.
2020లో తీసుకొచ్చిన అంతరిక్ష రంగ సంస్కరణలను చైర్మన్ ప్రశంసించారు. అవి భారత అంతరిక్ష రంగ వ్యవస్థను పూర్తిగా మార్చాయని అన్నారు. ఆ సంస్కరణలు ప్రకటించిన సమయంలో భారత్లో అంతరిక్ష రంగంలో కొన్ని అంకుర సంస్థలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ప్రయోగ వాహకాలు, ఉపగ్రహాలు, అనువర్తనాలు, ఆధునిక సాంకేతికతలపై పనిచేస్తున్న సుమారు 440 అంతరిక్ష అంకుర సంస్థలు దేశంలో ఉన్నాయని తెలిపారు.
‘‘విక్రమ్-1’’ కీలక విజయం
భారత ప్రైవేట్ రంగానికి చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేరడాన్ని డాక్టర్ నారాయణన్ కీలక విజయంగా పేర్కొన్నారు. భారత ప్రైవేట్ రంగానికి ఇది మైలురాయి అని చెప్పారు. అంకుర సంస్థలు, ఇస్రో, ఇన్స్పేస్ మధ్య సహకారం ఈ విజయానికి కారణమని తెలిపారు.
భారత అంతరిక్ష కార్యక్రమం సాంకేతికంగా ఎంత దూరం వచ్చిందో కూడా ఆయన వివరించారు. ఒకప్పుడు భారత్ విదేశీ సాంకేతికతలపై ఆధారపడేదని, అభివృద్ధి చెందిన అంతరిక్ష దేశాల నుంచి సాంకేతికత నిరాకరణ, ఆంక్షలను ఎదుర్కొందని గుర్తుచేశారు.
స్వదేశీ క్రయోజెనిక్ సాంకేతికతను విజయవంతంగా ఉపయోగించడం ఈ మార్పుకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు భారత్కు నిరాకరించిన ఈ సాంకేతికత ఇప్పుడు భారత భూభాగం నుంచి అధునాతన ఉపగ్రహాల ప్రయోగాలకు ఉపయోగపడుతోందని తెలిపారు.
అమెరికా సంస్థ రూపొందించిన 6 టన్నుల సమాచార ఉపగ్రహాన్ని భారత ప్రయోగ వాహక మార్క్-3 రాకెట్ ద్వారా తక్కువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ప్రయోగం భారత సామర్థ్యాలపై అంతర్జాతీయ నమ్మకాన్ని చూపించిందని, పూర్తిగా వాణిజ్య ప్రాతిపదికన ఈ అవకాశం లభించిందని తెలిపారు.
“భారత్ సామర్థ్యం, వినూత్న విధానం కారణంగానే ఇది సాధ్యమైంది” అని ఆయన అన్నారు. నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ మిషన్ నిసార్ను కూడా డాక్టర్ నారాయణన్ ప్రస్తావించారు. ఇప్పటివరకు రూపొందించిన అత్యంత అధునాతన భూ పరిశీలన ఉపగ్రహాల్లో ఇది ఒకటని తెలిపారు. భారత ఇంజినీర్లు నాసా ఖర్చులో 40%తో స్వదేశీ పరికరాన్ని రూపొందించారని చెప్పారు. మొత్తం ఉపగ్రహాన్ని భారత్, అమెరికా భాగస్వామ్యంతో రూపొందించి, నిర్మించి, ప్రయోగించినట్లు తెలిపారు.
ముందు చూస్తే భారత్ అంతరిక్ష అన్వేషణ కార్యక్రమాల జాబితా విస్తృతంగా ఉంది. చంద్రయాన్-3 విజయాన్ని కొనసాగిస్తూ చంద్రయాన్-4, చంద్రయాన్-5కు భారత్ సిద్ధమవుతోంది. శుక్ర గ్రహ ప్రయోగం, భవిష్యత్తులో అంగారక గ్రహంపై దిగే ప్రయోగానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం
భారత్ దీర్ఘకాలిక అంతరిక్ష లక్ష్యాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లక్ష్యాల్లో ఒకటైన 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రణాళికను ఆయన మరోసారి వెల్లడించారు. “2035 నాటికి మన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతున్నాం” అని ఆయన తెలిపారు. పరిశ్రమలు, అంకుర సంస్థల సహకారంతో వచ్చే 6 నుంచి 7 ఏళ్లలో 300కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
భారత్ ప్రస్తుత స్థాయికి చేరుకోవడానికి దోహదపడిన విజయాలను కూడా డాక్టర్ నారాయణన్ గుర్తుచేశారు. చంద్రయాన్-1 చంద్రుడిపై నీటి అణువుల ఆధారాలను కనుగొంది. చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో చారిత్రక సాఫ్ట్ ల్యాండింగ్ సాధించింది. ఆదిత్య ఎల్1 ప్రత్యేక సౌర పరిశీలనా కేంద్రాన్ని నిర్వహించగల దేశాల జాబితాలో భారత్ను చేర్చింది. అయితే డాక్టర్ నారాయణన్ దృష్టిలో అత్యంత ముఖ్యమైనది సాంకేతికతకు సంబంధించినది కాదు.. దేశ ప్రగతికి సంబంధించినది. 6 దశాబ్దాల్లో భారత్ సాధించిన అసాధారణ ప్రయాణాన్ని ఆయన పదేపదే ప్రస్తావించారు.
“64 ఏళ్ల క్రితం సైకిళ్లు, ఎద్దుల బండ్లతో అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం.. 2040 నాటికి చంద్రుడిపై అడుగుపెట్టే సమయంలో భారత్కు సాటి ఎవరూ ఉండరని నేను చెప్పగలను” అని ఆయన ప్రకటించారు. ప్రయోగ వాహక సాంకేతికత, ఉపగ్రహ సాంకేతికత, శాస్త్రీయ ప్రయోగాలు, అనువర్తనాలు, మౌలిక సదుపాయాల్లో భారత్ ప్రపంచంలోని అగ్రశ్రేణి అంతరిక్ష దేశాలతో సమానంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ఇస్రో ముందున్న తక్షణ సవాలు వచ్చే 4 నెలల్లో తొలి గగన్యాన్ మానవ రహిత ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టడం. భారత్కు ఈ ప్రయోగం కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు. అసాధారణమైన నిరాడంబరతతో ప్రారంభమైన ప్రయాణంలో ప్రపంచ అంతరిక్ష నాయకత్వం దిశగా భారత్ వేస్తున్న తదుపరి అడుగు.


