బ్రెజిల్, భారత్ మధ్య జరగనున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ను బహిష్కరించాలని భారత మాజీ ఫుట్బాల్ స్టార్ బైచుంగ్ భూటియా విజ్ఞప్తి చేసిన రోజు వ్యవధిలో బ్రెజిల్ ఫుట్బాల్ సమాఖ్య (సీబీఎఫ్) స్పందించింది. అక్టోబర్లో భారత్తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతామని, తమ ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు లేవని బ్రెజిల్ స్పష్టం చేసింది.
ఎవరో ఏవో వ్యాఖ్యలు చేసినంత మాత్రానా తాము వెనక్కి తగ్గమని, భారత్తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి తీరుతామని కుండబద్దలు కొట్టింది. బహిష్కరణ పిలుపుల వల్ల తాము ప్రభావితం కాలేదని బ్రెజిల్ తెలిపింది. ఇటువంటి ప్రతిచర్యలు స్థానిక రాజకీయాల వల్ల ప్రేరేపించబడ్డాయని పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే గురువారం కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియాన్ని బ్రెజిల్ ఫుట్బాల్ సమాఖ్య ప్రతినిధి బృందం తనిఖీలు చేసింది. పిచ్పై గడ్డి సాంద్రత తక్కువగా ఉందని, దీనివల్ల ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశముందని నివేదికలో పేర్కొంది. తక్షణమే పిచ్పై గడ్డి సాంద్రతను పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఐదుసార్లు ఫిఫా చాంపియన్ అయిన బ్రెజిల్తో మ్యాచ్ ఆడేందుకు భారత్ ఫుట్బాల్ జట్టు సిద్ధమైన తరుణంలో బైచుంగ్ భూటియా చేసిన వ్యాఖ్యలు ఆలోచనలో పడేశాయి. కానీ బ్రెజిల్ ఫుట్బాల్ సమాఖ్య తాము ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతామని తేల్చి చెప్పడం ఊరటనిచ్చింది. అక్టోబర్లో బ్రెజిల్తో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న భారత్ ఆ తర్వాత మరో రెండు స్నేహపూర్వక మ్యాచ్లు కూడా ఆడనుంది. రెండో ప్రత్యర్థిగా కేప్ వెర్డేను ఎంచుకుంది. ఇక భారత్ ఆడబోయే మూడో ఫ్రెండ్లీ మ్యాచ్లో జట్టు ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.
భారత్, బ్రెజిల్ మధ్య జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ను బహిష్కరించాలని భారత మాజీ ఫుట్బాల్ స్టార్ బైచుంగ్ భూటియా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. భారత్, బ్రెజిల్ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహణ కోసం రూ. 60 నుంచి 70 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశముందని, భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండడంతో అభిమానులంతా ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ను బహిష్కరించాలని పేర్కొన్నాడు.


