స్లోవేకియా వేదికగా జరుగుతున్న అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు వచ్చి చేరాయి. మహిళల విభాగంలో మాన్సీ లాథర్ రజతం.. తన్వి తన్వీ మగ్దుమ్, కోమల్ కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.
గోల్డ్.. జస్ట్ మిస్
68 కేజీల స్వర్ణ పతక పోరులో మాన్సీ లాథర్ చైనాకు చెందిన చెన్లింగ్ సాంగ్తో తలపడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ గేమ్లో మాన్సీ 1-2 తేడాతో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకుంది. 57 కేజీల కాంస్య పతక పోరులో తన్వి.. కెనడాకు చెందిన అగ్నియా క్రాకోవ్స్కాపై 10-4 తేడాతో తిరుగులేని విజయం సాధించి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది.
మరోవైపు 59 కేజీల విభాగంలో కోమల్ 5-2తో ఎడా బాలాజ్ (హంగేరీ)ని చిత్తుచేసింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆరు పతకాలు సాధించింది. శుక్రవారం 76 కేజీల విభాగం ఫైనల్లో కాజల్ దోచాక్ గెలిచి ఛాంపియన్గా నిలిచింది.


