సాక్షి,న్యూఢిల్లీ: పండగల సీజన్లో అమాంతం పెరుగుతున్న చక్కెర ధరల్ని నియంత్రించేందుకు సరఫరాను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 31, 2026 వరకు ఎలాంటి సుంకం లేకుండా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను దిగుమతి చేసుకునేందుకు వీలుగా విధానాన్ని సవరించింది. గత ఏడాదితో పోలిస్తే రిటైల్ ధరలు సుమారు 13 శాతం పెరగడం, మిల్లుల వద్ద ఎక్స్-మిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడం దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు ఇదే అంశంపై పాక్.. భారత్ను అర్రులు చాస్తోంది. తమ వద్ద ఉన్న షుగర్ కొనులు చేసి ఆర్థికంగా తమని ఆదుకోవాలనే ప్రతిపాదనలు చేసే యోచనలో ఉందంటూ ఆదేశ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. .
భారత్ దిగుమతికి మార్గం సుగమం చేయడంతో పాకిస్థాన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ దీనిని ఒక అవకాశంగా మలచుకోవాలని భావిస్తోంది. ఈక్రమంలో హుంజా షుగర్ మిల్స్ ప్రతినిధి పీఎస్ఎంఏ సీనియర్ సభ్యుడు చౌదరి ముహమ్మద్ వహీద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్లో ప్రస్తుతం 12 లక్షల టన్నులకు పైగా మిగులు నిల్వలు ఉన్నాయి. వచ్చే చెరుకు పంట చేతికొచ్చే సమయానికి ఈ నిల్వలను విక్రయించకపోతే కొత్త పంట కొనుగోలు చేయడానికి మిల్లులకు ఇబ్బందులు ఎదురవుతాయి.
భారత్కు సమీపంలో ఉండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్యం లభిస్తుందని. మిల్లుల ద్రవ్యత మెరుగుపడి రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించడానికి వీలవుతుందని పాకిస్థాన్ వర్గాలు భావిస్తున్నాయి.
వాణిజ్య సంబంధాల సవాళ్లు
ఇరు దేశాల మధ్య గతంలోనే రాజకీయ, భద్రతా ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య మార్గాలు (అటారీ-వాఘా సరిహద్దు, విమాన మార్గాలు) మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ప్రకారం పాకిస్థాన్ నేరుగా భారత్కు చక్కెర ఎగుమతి చేయడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మిల్లులు తమ ప్రభుత్వాన్ని ప్రత్యేక అనుమతులు కోరుతున్నాయి. అందువల్ల భారత్ తీసుకున్న దిగుమతి నిర్ణయం తక్షణ వాణిజ్య ఒప్పందంగా కాకుండా, కేవలం ఒక ఆరంభంగానే చూడాల్సి ఉంది.
ఇథనాల్ ప్రభావం..ప్రభుత్వ వాదన
భారత్లో చక్కెర ధరల పెరుగుదలకు కేవలం ఇథనాల్ వైపు చెరకు మళ్లింపు మాత్రమే కారణం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోల్లో 20శాతం ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్, బయోఫ్యూయల్ రంగాన్ని బలోపేతం చేయడానికి గత కొన్ని సీజన్లలో లక్షలాది టన్నుల చక్కెరను ఇథనాల్ వైపు మళ్లించింది. అయితే ప్రస్తుత ధరల అస్థిరతకు మార్కెట్లో కొంతమంది చేసే అసాధారణ నిల్వలు, ఊహాజనిత లావాదేవీలే కారణమని ఆహార, ప్రజా పంపిణీ శాఖ పేర్కొంది.


