న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఐటీవో సమీపంలో వికాస్ మార్గ్లోని పీడబ్ల్యూడీ ప్రధాన కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అనిల్ ఝా, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సహా ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ఎస్యూవీని ఎదురుగా వచ్చిన ఓ హ్యాచ్బ్యాక్ కారు వేగంగా ఢీకొట్టింది. సెంట్రల్ ఢిల్లీ డీసీపీ రోహిత్ రణ్బీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్కు ప్రమాదం గురించి సమాచారం అందింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఢిల్లీ రిజిస్ట్రేషన్ కలిగిన రెండు దెబ్బతిన్న వాహనాలను గుర్తించారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఢిల్లీలోని ఆర్య నగర్కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఇద్దరు మైనర్ పిల్లలతో కలిసి లక్ష్మీ నగర్ నుంచి ఐటీవో వైపు హ్యాచ్బ్యాక్ కారులో వెళ్తున్నారు. పీడబ్ల్యూడీ కార్యాలయం సమీపంలోకి రాగానే, ఆ కారు అదుపుతప్పి రహదారి డివైడర్ను, రైలింగ్ను ఢీకొట్టింది. అనంతరం ఆపోజిట్ క్యారేజ్వే వైపు దూసుకెళ్లి, ఐటీవో నుంచి లక్ష్మీ నగర్ వైపు వెళ్తున్న ఎస్యూవీని బలంగా ఢీకొంది. ఆ ఎస్యూవీలో కిరారీ విధానసభ నియోజకవర్గ సిట్టింగ్ ఆప్ ఎమ్మెల్యే అనిల్ ఝా, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ప్రయాణిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఎస్యూవీ ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. రెండు వాహనాల్లోని మొత్తం ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లోక్నాయక్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు.
ఇది కూడా చదవండి: భారత్కు 150 మంది పాక్ వధువులు


