అనంతపురం జిల్లా: శునకానికి పూజలు నిర్వహించారు. సహపంక్తి భోజనాలు చేశారు. వర్షం కోసం విడపనకల్లు మండలం కొట్టాలపల్లిలో గ్రామస్తులు పాటించిన వింత ఆచారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుకు విరామం తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వరుణుడి కరుణ కోసం విడపనకల్లు మండలం కొట్టాలపల్లివాసులు పూర్వ కాలం నుంచి వస్తున్న వింత ఆచారాన్ని శనివారం పాటించారు.
కాటమయ్యగా భావించే శునకాన్ని పూలతో అలంకరించి, కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుక్కను గ్రామంలో ఊరేగించారు. పెళ్లి భోజనాల తరహాలో పది రకాల వంటకాలు చేసి చుట్టు పక్కల గ్రామాల వారికి పొలంలోనే భోజనాలు ఏర్పాటు చేశారు. సహపంక్తి భోజనాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం గమనార్హం. అనంతరం కుక్కకు కూడా భోజనం పెట్టి దానికి నీళ్లు ఇవ్వకుండా వదిలేశారు. అలా వదిలేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తుల నమ్మకం.


