అనంతపురం: ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు స్థానిక సమస్యలపై ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. శనివారం పాతగుంతకల్లులోని ఆరో వార్డు వాల్మీకి సర్కిల్ ఏరియా నుంచి దోనిముక్కల రోడ్డులో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని మరోచోట తాగునీటి సరఫరా మెరుగుదల పథకం భూమిపూజకు కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో ఆరోవార్డు ప్రజలు ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకున్నారు. దోనిముక్కలకు వెళ్లే ప్రధాన రహదారిలో డ్రెయినేజీ లేక రోడ్డుకు ఇరు వైపులా మురుగు పారుతోందని, వర్షం పడిన సమయంలో రొచ్చురొచ్చుగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మురుగుపై దోమలు వాలడం వల్ల తాము అనారోగ్యాల పాలవుతున్నామని ప్రజలు తెలిపారు. ‘ఎమ్మెల్యే సారూ... ఒక్కసారి కిందకు దిగి రోడ్డుపై ఉన్న మురుగును చూడండి.. మా బాధలు తెలుసుకోండి’ అంటూ వేడుకున్నా ఎమ్మెల్యే పలకలేదు. ప్రజాప్రతినిధే పట్టనట్టు ఉంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు డ్రెయినేజీ ఏర్పాటు చేస్తామని ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో వార్డు ప్రజలు శాంతించారు.


