సెల్ఫీ కోసం వచ్చి రాహుల్‌కి ముద్దుపెట్టిన యువతి.. వేదికపై హైడ్రామా! | Rahul Gandhi gets surprise kiss from student Pune event Viral Video | Sakshi
Sakshi News home page

సెల్ఫీ కోసం వచ్చి రాహుల్‌కి ముద్దుపెట్టిన యువతి.. వేదికపై హైడ్రామా!

Aug 24 2026 11:59 AM | Updated on Aug 24 2026 12:11 PM

Rahul Gandhi gets surprise kiss from student Pune event Viral Video

ముంబై: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ యువతతో మమేకమయ్యే కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీల కోసం వేదికపైకి వచ్చిన ఓ యువ విద్యార్థిని.. అందరి ముందే రాహుల్‌ గాంధీ చెంపపై ముద్దుపెట్టుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మహారాష్ట్రలోని పూణేలో రాహుల్‌ గాంధీ ‘ఛాత్రోం కీ గూంజ్‌’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ వేదికపై యువతతో మాట్లాడటంతో పాటు వారితో సెల్ఫీలు దిగారు. అదే సమయంలో ఓ విద్యార్థిని రాహుల్‌ వద్దకు వచ్చి ఆయన చెంపపై ముద్దు పెట్టింది. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో రాహుల్‌ షాకయ్యారు. అనంతరం రాహుల్‌ కొద్దిసేపు ఆమెతో మాట్లాడారు. తర్వాత భద్రతా సిబ్బందితో కలిసి వేదిక నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమం మొత్తం కచేరీ తరహా లైటింగ్‌, భారీ ఏర్పాట్లతో సాగింది.

ఈ ఘటన అనంతరం, 11వ తరగతి చదువుతున్న సదరు యువతి మరియం మాట్లాడుతూ..‘రాహుల్‌ గాంధీలా ఎదగడం నా కల. రాహుల్‌ గాంధీ అడుగుజాడల్లో నడవాలని, ఆయనలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం యువతలో రాహుల్‌ గాంధీ తనదైన ప్రభావాన్ని చూపుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన వదిలిన అంశాలనే పట్టుకుని ముందుకు సాగుతున్నారు’ అని వ్యాఖ్యలు చేసింది.

సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్లు
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో వైరల్‌ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రాహుల్‌ గాంధీతో మహిళలు, యువతులు ఎంత సౌకర్యంగా మెలుగుతున్నారో కొందరు ప్రస్తావించగా.. మరికొందరు ఈ ఘటనను సరదాగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ చేసిన రాజకీయ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ‘మనుస్మృతి’ భావజాలాన్ని విమర్శించిన ఆయన.. మహిళలు పితృస్వామ్యాన్ని ఎదిరించాలని పిలుపునిచ్చారు.

రాహుల్‌ సభపై బీజేపీ ఫైర్‌
రాహుల్‌ కార్యక్రమంపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల సమస్యలపై సీరియస్‌గా మాట్లాడకుండా రాహుల్‌ సాధారణ రాజకీయ ప్రసంగానికే పరిమితమయ్యారని మహారాష్ట్ర బీజేపీ నేత కేశవ్‌ ఉపాధ్యాయ్‌ ఆరోపించారు. సభకు జనాన్ని సమీకరించేందుకు కాలేజీ బస్సులను ఉపయోగించారని కూడా ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ మాత్రం బీజేపీ విమర్శలను తిప్పికొట్టింది. రాహుల్‌ గాంధీ కార్యక్రమానికి వచ్చిన అపూర్వ స్పందనను చూసి బీజేపీ నేతలు అసహనంతో ఉన్నారని కాంగ్రెస్‌ నేత సచిన్‌ సావంత్‌ విమర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement