‘అద్భుతమైన జెన్‌ జీ ముఖాలు’.. సీజేపీ సౌరవ్‌ దాస్‌ సెటైర్లు | BJP’s Gen Z Push Backfires? Cockroach Janata Party Mocks Its New Youth Outreach Team, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

‘అద్భుతమైన జెన్‌ జీ ముఖాలు’.. సీజేపీ సౌరవ్‌ దాస్‌ సెటైర్లు

Aug 23 2026 7:35 PM | Updated on Aug 23 2026 8:53 PM

 Three claps for marvellous set of Gen Z faces CJP Saurav

న్యూఢిల్లీ: దేశంలోని జెన్‌ జీకి చేరువయ్యేందుకు బీజేపీ మొదలు పెట్టిన కార్యక్రమం, అందుకోసం ఎంపిక చేసిన నేతలపై కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆదివారం విమర్శలు చేసింది. “అద్భుతమైన జెన్‌ జెడ్‌ ముఖాలను ఎంపిక చేసిన బీజేపీకి మూడు చప్పట్లు” అంటూ ఎక్స్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ సెటైర్లు వేశారు. దేశ యువతను గతంలో “వైరస్‌, కాక్‌రోచ్‌” అని, వారిని “టుక్డే టుక్డే గ్యాంగ్‌”తో పోల్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.

“జెన్‌ జీను ‘చేరువ చేసుకునేందుకు’ బీజేపీ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. నితిన్‌ నబిన్‌ ఇటీవల యువతరాన్ని ‘వైరస్‌, కాక్రోచ్‌’ అని, నిరసనకారులను ‘టుక్డే టుక్డే గ్యాంగ్‌’లో భాగమని అన్నారు” అని దాస్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యువతతో సంబంధాలను బలోపేతం చేసేందుకు బీజేపీ కొత్తకార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని శనివారం ఏర్పాటు చేయడంతో దాస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

“బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శులు స్మృతి ఇరానీ, వినోద్‌ తావ్డే, గుజరాత్‌ మంత్రి హర్ష్‌ సంఘవి, ఛత్తీస్‌గఢ్‌ మంత్రి ఓపీ చౌదరి సహా పలువురు నేతలను ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన బృందంలో చేర్చారు” అని ఏఎన్‌ఐ తెలిపింది.

స్మృతి ఇరానీపై కూడా దాస్‌ విమర్శలు చేశారు. ఆమెను రెండేళ్లలోనే విద్యా మంత్రిత్వ శాఖ నుంచి ఎందుకు తప్పించారో “గూగుల్‌లో వెతకాలని” అన్నారు. “యేల్‌ యూనివర్సిటీ”గా ఆయన పేర్కొన్న సంస్థ నుంచి ఆమె పొందిన డిగ్రీపైనా ప్రశ్నలు లేవనెత్తారు.

“ఇక స్మృతి ఇరానీ... సరే సరే... 2016లో రెండేళ్లలోనే ఆమెను విద్యా మంత్రిత్వ శాఖ నుంచి ఎందుకు తప్పించారో గూగుల్‌లో వెతకండి. రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసును ఆమె నిర్వహించిన తీరు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేయడం, ‘యేల్‌ యూనివర్సిటీ’ నుంచి ఆమె పొందిన డిగ్రీపై ఉన్న సందేహాలు.. ఇవన్నీ యువతకు ఉపన్యాసాలు ఇచ్చే గొప్ప నైతిక అధికారం ఆమెకు కల్పిస్తున్నాయి” అని దాస్‌ చురకలంటించారు.

బీజేపీ జెన్‌ జీ కార్యక్రమం
శనివారం నబిన్‌ కొత్తగా ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ బృందం తొలి పరిచయ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ కార్యాలయ బాధ్యతలు చేపట్టిన కొత్త టీమ్‌ పనికి ఈ సమావేశంతో అధికారికంగా శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా యువ ఓటర్లతో మరింత ప్రత్యక్షంగా, నిరంతరంగా సంబంధాలు పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ త్వరలో జెన్‌ జీ చేరువ కార్యక్రమాన్ని ప్రారంభించనున‍్నారు

జెన్‌ జీ ఆకాంక్షలు, ఆందోళనలు, అంచనాలను అర్థం చేసుకోవడంపై ఈ కార్యక్రమం దృష్టి పెట్టే అవకాశం ఉంది. యువతకు బీజేపీ నేతలతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడంతో పాటు, తమను ప్రభావితం చేసే అంశాలపై అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఇవ్వనున్నారు. చర్చలు, పరస్పర సమావేశాలు, ఇతర కార్యక్రమాల ద్వారా యువ ఓటర్లతో సంబంధాలను బలోపేతం చేసి, యువ తరంలో పార్టీ చేరువను విస్తరించడమే లక్ష్యంగా బీజేపీ భావిస్తోంది. సమావేశంలో కొత్తగా నియమితులైన పార్టీ బాధ్యులు “యువ సంవాద్‌”కు, అంటే యువతతో నిరంతర సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వాలని నబిన్‌ సూచించారు.

ఇదీ చదవండి: ప్రపంచం ముందు భారత్‌ తలెత్తుకు నిలబడేలా.. 4 నెలల్లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement