భారతీయ రైల్వే రవాణా రంగంలో మరొక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భారతీయ రైల్వే తన మొదటి 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలును నడిపింది. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి గుజరాత్లోని వడోదర డివిజన్ పరిధిలో ఉన్న వర్ణామ వరకు రైల్వే శాఖ తొలిసారిగా భారీ 'డబుల్ స్టాక్ లాంగ్ హాల్' కంటైనర్ రైలును విజయవంతంగా నడిపింది.
ఈ రైలు ఆగస్టు 21, 2026 రాత్రి 7 గంటలకు జేఎన్పీటీ నుంచి బయలుదేరి.. 360 టీఈయూల (కంటైనర్లు) సరుకును మోసుకెళ్ళింది. జీసీటీ టెర్మినల్ చేరుకోవడానికి ఇది సుమారు 422 కి.మీ దూరం ప్రయాణించింది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ రవాణా కోసం రెండు డబల్-స్టాక్ రాక్లను కలిపి ఒకే లాంగ్-హాల్ రైలుగా ఏర్పాటు చేశారు. ప్రతి రాక్ 180 టీఈయూలను మోసుకెళ్ళింది. దీంతో రైలు మొత్తం సామర్థ్యం 360 టీఈయూలకు చేరింది.
ఇదీ చదవండి: ఆ విషాదానికి ఒక్కరోజు ముందు తల్లి సంచలన వీడియో
ఈ లాంగ్-హాల్ రైలులో రెండు డబల్-స్టాక్ రాక్లు ఉన్నాయి. జెఎన్పీటీ నుండి వడోదర వరకు వెళ్లిన ముందు రాక్ 45+1 లోడ్ను కలిగి ఉంది, దీనిని 60311 లోకోమోటివ్ లాగింది. దీని బరువు 1,817 టన్నులు. అలాగే జెఎన్పీటీ-వడోదర మధ్యే నడిచిన వెనుక రాక్ కూడా 45+1 లోడ్ను కలిగి ఉంది. దీనిని 24690 లోకోమోటివ్ లాగింది. ఇది 2,105 టన్నుల బరువును మోసుకెళ్ళింది. ఒకే రైలులో ఎక్కువ కంటైనర్లను రవాణా చేయడం ద్వారా ఓడరేవుల నుండి కంటైనర్లను త్వరగా తరలించడంతో టెర్మినళ్ల వద్ద రద్దీని తగ్గించవచ్చు.
📢 First Long Haul (1.3 km) Double Stack container train on Western Dedicated Freight Corridor
JNPT, Mumbai -> Vadodara, Gujarat pic.twitter.com/CY9kWabvrM— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 22, 2026
డబల్-స్టాక్ రైలు ఆపరేషన్ల ద్వారా కంటైనర్లను ఒకదానిపై ఒకటి ఉంచి రవాణా చేయవచ్చు.. తద్వారా ఒకే ప్రయాణంలో ఎక్కువ సరుకును రవాణా చేయడానికి వీలవుతుంది. ఈ రైలు విద్యుత్ ద్వారా నడుస్తోంది కాబట్టి.. డీజిల్తో నడిచే రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు ఒకే లాంగ్-హాల్ డబల్-స్టాక్ కంటైనర్ రైలు భారీ సంఖ్యలో ట్రక్కులు అవసరమయ్యే సరుకును సులభంగా రవాణా చేయగలదని జాతీయ రవాణా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.


