దుకాణం బయట స్థానికులు-ఇద్దరు దొంగలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
అహ్మదాబాద్: గుజరాత్లోని వల్సాద్ జిల్లా పోలీసులకు బుధవారం అర్ధరాత్రి తర్వాత ఓ అత్యవసర కాల్ వచ్చింది. అయితే, అవతలి వైపు మాట్లాడుతున్న వ్యక్తి.. ‘సార్, మేము దొంగతనానికి వచ్చాము.. కానీ జనం షట్టర్ దించేశారు. దయచేసి మమ్మల్ని కాపాడండి" అంటూ చెప్పాడు. షట్టర్ బయట గుంపు గుమికూడిందని.. తమపై దాడి చేస్తారనే భయంతో దొంగలు ఈ పని చేశారు.
వాపి పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంజన్ గ్రామంలోని బీజే జ్యువెలర్స్ అనే దుకాణంలోకి ఈ ఇద్దరు దొంగలు చొరబడ్డారు. గుజరాత్కు మహారాష్ట్ర, దాద్రా, నగర్ హవేలీ, డామన్ సరిహద్దుల సమీపంలో ఈ ప్రాంతం ఉండటం వల్ల నేరస్థులు సులభంగా వేరే రాష్ట్రాలకు పరారయ్యేందుకు వీలుగా ఈ ప్రాంతాన్ని తరచూ టార్గెట్ చేస్తుంటారు. అయితే, దినేష్ సోంకర్, బిపిన్ పాఠక్ల పథకం అనుకున్నట్లుగా పారలేదు.
కొంతమంది స్థానికులు దుకాణం తాళం పగలగొట్టడాన్ని గమనించి అనుమానంతో షట్టర్ కిందికి దించేశారు. దీనితో ఆ ఇద్దరు దొంగలు లోపలే చిక్కుకుపోయారు. బయట జనసమూహం పెరగడంతో, దొంగలు తమను తాము లోపల లాక్ చేసుకుని.. చివరికి పోలీసు హెల్ప్లైన్ 112 కి డయల్ చేయాలని నిర్ణయించుకున్నారు.
పోలీసులు వచ్చి వారిని రక్షించి అరెస్టు చేసే సమయానికి, కర్రలతో వచ్చిన కొంతమంది స్థానికులు షట్టర్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వారి వద్ద నుండి దొంగిలించడానికి పోగుచేసిన ఆభరణాలను, అలాగే దొంగతనం కోసం తెచ్చిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వారి నేర చరిత్రను పరిశీలించేందుకు పోలీసు రిమాండ్ను కోరతామని డీఎస్పీ బి. దవే తెలిపారు.


