టైలర్‌కు షాక్‌.. ఏకంగా రూ.975 కోట్ల ఐటీ నోటీస్‌ | 15000 Month Tailor Gets 975 Crore Tax Notice | Sakshi
Sakshi News home page

టైలర్‌కు షాక్‌.. ఏకంగా రూ.975 కోట్ల ఐటీ నోటీస్‌

Aug 22 2026 9:30 PM | Updated on Aug 22 2026 9:35 PM

15000 Month Tailor Gets 975 Crore Tax Notice

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన 62 ఏళ్ల టైలర్ రేఖ్‌రాజ్ థాడా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుట్టు మిషన్‌పై పనిచేస్తూ నెలకు కేవలం రూ.15 వేలు సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి.. అయితే సూరత్‌ ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసు.. ఒకసారిగా షాక్‌కు గురి చేసింది. ఆయన తన జీవితంలో సూరత్‌కు ఎప్పుడూ రాలేదు. కానీ అతడిని సూరత్‌లోని ఓ నకిలీ కంపెనీకి డైరెక్టర్‌గా చూపించి.. ఏకంగా రూ.975 కోట్ల పన్ను బకాయి నోటీసు జారీ అయ్యింది. మోసగాళ్లు.. ఆయన పత్రాలను దుర్వినియోగం చేసి.. కాగితాలపై రూ. 2,500 కోట్ల హవాలా లావాదేవీలు నిర్వహించినట్లు తేలింది.

మీడియా.. ఈ నకిలీ కంపెనీ రిజిస్టర్డ్ చిరునామాకు వెళ్లి వాస్తవాలను పరిశీలించగా.. అక్కడ డైమండ్ కంపెనీ ఏదీ లేదని తేలింది. అక్కడ సాధారణంగా జరీ యంత్రాలు, ఐస్‌గోలా యంత్రాలను మరమ్మతు చేసే వర్క్‌షాప్ మాత్రమే ఉంది. ‘‘మా కుటుంబం తరతరాలుగా ఇక్కడే ఉంటోంది.. డైమండ్ కంపెనీ పేరు కూడా వినలేదు. సూరత్‌లో కంపెనీ రిజిస్టర్డ్ చిరునామాగా చూపించిన ప్రదేశంలో దీపక్‌భాయ్ హస్ముఖ్‌భాయ్ క్లెట్‌వాలా కుటుంబం నివసిస్తోంది. 1997లో ఇల్లు నిర్మించినప్పటి నుంచి తమ కుటుంబం అక్కడే ఉంటోందని ఆయన తెలిపారు.

తన తండ్రి కాలం నుంచి శ్రీరామ్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్’ నడుపుతున్నామని.. అక్కడ జరీ యంత్రాలు, ఐస్‌గోలా తయారీ పరికరాల మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఎలాంటి బ్యాంకు లేదా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమ చిరునామాను ధృవీకరించేందుకు ఎప్పుడూ రాలేదని తెలిపారు. అంతేకాకుండా, రూప్ రజత్ డైమండ్ కంపెనీ అనే సంస్థ గురించి గానీ, దానితో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి గానీ తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తన పాన్ కార్డును గుర్తుతెలియని వ్యక్తులు దుర్వినియోగం చేశారంటూ రేఖ్‌రాజ్.. ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసుకు ఈమెయిల్ ద్వారా సమాధానం పంపారు. అసలు తనకు సంబంధం లేని వ్యవహారమని రేఖ్‌రాజ్‌ తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement