ఓటమి దెబ్బకు డీఎంకేలో ఊహించని విధంగా భారీ మార్పులు | DMK Announces Major Organisational Overhaul After Tamil Nadu Poll Defeat, Introduces Age And Term Limits, Check More Details | Sakshi
Sakshi News home page

ఓటమి దెబ్బకు డీఎంకేలో ఊహించని విధంగా భారీ మార్పులు

Aug 22 2026 6:19 PM | Updated on Aug 22 2026 6:40 PM

 DMK passes nine resolutions for sweeping organisational overhaul

న్యూఢిల్లీ: ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయిన నేపథ్యంలో శనివారం ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తన పార్టీ సంస్థాగత వ్యవస్థలో భారీ మార్పులను ప్రకటించింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే కార్యవర్గం చెన్నైలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో సమావేశమై, పార్టీ వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే లక్ష్యంతో 9 కీలక తీర్మానాలను ఆమోదించింది.

సమావేశంలో మాట్లాడిన స్టాలిన్, మార్పులు కఠినంగా ఉంటాయని, కొందరు వాటిని అంగీకరించడం కష్టంగా కూడా ఉండవచ్చని అంగీకరించారు. “మన పార్టీ పదవుల్లో ఉన్నవారి పనితీరు కూడా మన ఓటమికి ఒక కారణం. ముందుగా మన తప్పులను అంగీకరించాలి. పార్టీ సంస్థాగత వ్యవస్థలో పలు మార్పులు చేయబోతున్నాం. అవి కచ్చితంగా కఠినంగా ఉంటాయి. కొందరికి వాటిని అంగీకరించడం కష్టంగా కూడా ఉండవచ్చు. ఇకపై బాధ్యతలకు అనుగుణంగా వివిధ సంస్థాగత పదవులకు వయో పరిమితులు, పదవీకాల పరిమితులను ప్రవేశపెట్టబోతున్నాం. కొత్తవారికి ఎక్కువ సంఖ్యలో సంస్థాగత బాధ్యతలు అప్పగించబోతున్నాం. పార్టీని పునర్వ్యవస్థీకరించడం ద్వారానే రాజకీయ విజయాన్ని తిరిగి సాధించగలం. సంస్థాగత సంస్కరణలను వీలైనంత త్వరగా చేపట్టాలి” అని స్టాలిన్‌ తెలిపారు.

కొత్త ప్రణాళిక ఏంటి? 
కొత్త ప్రణాళిక ప్రకారం.. డీఎంకే నాయకత్వం కఠినమైన వయో పరిమితులను, అన్ని పదవులకు తప్పనిసరిగా 2 పర్యాయాల పదవీకాల పరిమితిని ప్రవేశపెట్టింది. సంస్థాగత జిల్లాల సంఖ్యను కూడా భారీగా పెంచనుంది. పార్టీ కార్యకలాపాలను మరింత వృత్తిపరంగా నిర్వహించడం, తరాల మార్పును సులభతరం చేయడం ఈ చర్యల లక్ష్యం.

డీఎంకే సంస్థాగత జిల్లాల సంఖ్యను 78 నుంచి 110కు పెంచనుంది. ప్రతి జిల్లా సుమారుగా 2 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా స్థానిక స్థాయి పరిపాలనను మరింత బలోపేతం చేయనున్నారు. స్టాలిన్ 110 పునర్వ్యవస్థీకరించిన జిల్లాల సరిహద్దుల పటాలను అధికారికంగా విడుదల చేసిన తర్వాత, మార్పులను అమలు చేసేందుకు పార్టీ ప్రధాన కార్యాలయం పర్యవేక్షణలో జిల్లా కార్యవర్గాలు 15 రోజుల్లో సమావేశం కావాల్సి ఉంటుంది.

కోయంబత్తూరు, తాంబరం వంటి ప్రధాన పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక నగర కార్యదర్శి పదవిని కూడా రద్దు చేశారు. ఇకపై ఓటర్ల సంఖ్య ఆధారంగా పట్టణ ప్రాంతాలను పునర్విభజించనున్నారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని కమిటీల్లో సగటున 40,000 మంది ఓటర్లు, ఇతర కార్పొరేషన్లలోని కమిటీల్లో సగటున 30,000 మంది ఓటర్లు ఉండేలా ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసుకు చిన్నారెడ్డి సమాధానం ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement