లక్నో: ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 178 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఢిల్లీ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E 2381 ల్యాండింగ్ సమయంలో విమానం వెనుక భాగం రన్వేను తాకింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫైలట్ వెంటనే గో-అరౌండ్ చేసి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది.
అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి అనుమతి తీసుకుని కొద్దిసేపటి తర్వాత విమానాన్ని రెండో ప్రయత్నంలో సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన సాధారణ తనిఖీల్లో దాని వెనుక భాగంలోని ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU) సమీపంలో గీతలు, రాపిడి గుర్తులు కనిపించాయి. దీంతో విమానాన్ని తాత్కాలికంగా సేవల నుంచి తొలగించారు.
ప్రస్తుతం విమానంపై సాంకేతిక తనిఖీలు, మరమ్మతులు జరుగుతున్నాయని అవసరమైన సాంకేతిక అనుమతులు లభించిన తర్వాత మాత్రమే విమానాన్ని తిరిగి కార్యకలాపాల్లోకి తీసుకురానున్నట్లు ఇండిగో సిబ్బంది ప్రకటించారు. ఈ ప్రభావంతో గోరఖ్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E-5013 సుమారు 5 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది.
కాగా ఇటీవల ఇండిగో విమానంలో తరచుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కోల్కతా–చెన్నై 6E-723 విమానంలో ల్యాండింగ్కు ముందు ఎడమ ఇంజిన్ పనిచేయకుండా పోయింది. చెన్నైలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించగా, 224 మంది ఉన్న విమానం ఒక ఇంజిన్తో సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఆగస్టు 13న భువనేశ్వర్–కోల్కతా ఇండిగో విమానంలో ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలో పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించారు. భద్రతా కారణాలతో ఆ విమానాన్ని రద్దు చేశారు. ఇలాంటి ఘటనలు తరుచుగా జరగడం ప్రయాణికులకు ఆందోళన కలిగించే విషయం


