ఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2016లో ఢిల్లీలోని యమునా నది వరద మైదానాల్లో నిర్వహించిన ‘వరల్డ్ కల్చర్ ఫెస్టివల్’ కారణంగా పర్యావరణానికి నష్టం జరిగిందన్న ఆరోపణలపై విధించిన రూ.5 కోట్ల జరిమానాను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమం వల్ల యమునా నది సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు నష్టం జరిగినట్లు నిర్ధారించే ప్రత్యక్ష ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దీంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలోని రిజిస్టర్డ్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యక్తి వికాస్ కేంద్ర చెల్లించిన రూ.5 కోట్ల మొత్తాన్ని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ రోజు శనివారం ఈకేసును విచారించిన సుప్రీంక్రోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
2017లో ఎన్జీటీ జరిమానా
2016 మార్చి 11 నుంచి 13 వరకు ఢిల్లీలో యమునా నది ఒడ్డున ‘వరల్డ్ కల్చర్ ఫెస్టివల్’ నిర్వహించారు. కార్యక్రమం కోసం యమునా వరద మైదానాలను సిద్ధం చేయడం వల్ల పర్యావరణానికి నష్టం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) 2017 డిసెంబర్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ను నష్టానికి బాధ్యులుగా పేర్కొంది.
పర్యావరణ నష్టానికి పరిహారంగా రూ.5 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తాజాగా ఆ కేసులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తప్పిదమేమి లేదని తేల్చింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని కార్యక్రమంతో నేరుగా అనుసంధానించే ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.
DDAపైనాా సుప్రీంకోర్టు ఆగ్రహం
ఈ సందర్భంగా యమునా వరద మైదానాలను పరిరక్షించడంలో DDA తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.అదే సమయంలో, యమునా వరద మైదానాల పునరుద్ధరణకు సంబంధించి NGT ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేపట్టిన పనులను DDA కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ వ్యవహారం చాలా ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో ఎన్నో ఏళ్లపాటు న్యాయపోరాటంగా కొనసాగగా తాజా సుప్రీం తీర్పుతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు ఉపశమనం లభించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ 1981లో స్థాపించారు.


