విద్య పూర్తిచేసుకుని ఉద్యోగం సంపాదించడం, సొంత ఇల్లు కొనడం, ఆ తర్వాత పెళ్లి చేసుకుని భార్య, పిల్లలతో కుటుంబ జీవితాన్ని ప్రారంభించడం.. గత తరాలు అనుసరించిన ఈ జీవన విధానం ప్రస్తుతం చాలా మంది మిలీనియల్స్కు దూరమైన కలలా మారింది. భారత్లోని మెట్రో నగరాలతో పాటు ఎన్నో దేశాల్లో సొంత ఇల్లు కట్టుకోవడం గగనంగా మారింది. ఇల్లు కొనడం అంటే మొదటగా గుర్తువు వచ్చేది మిలీనియల్స్. జెన్ జీలో చాలా మంది ఇప్పుడిప్పుడే ఉద్యోగం, పెళ్లి బంధంలోకి అడుగుపెడుతుంటారు.
మిలీనియల్స్లో చాలా మంది ఇల్లు కొనే ఆలోచనలో ఉంటారు. దీంతో మిలీనియల్స్ తరానికి సొంత ఇల్లు కొనడం చాలా కాలంగా పెద్ద సవాలుగా మారిన తీరుపై ఓ సర్వే చేశారు. అక్కడ 1990 దశకం మధ్యలో బ్రిటన్లో జన్మించిన వారికి ప్రస్తుతం సొంత ఇల్లు ఉండే అవకాశం సుమారు 25 శాతమే ఉంది. 1990 దశకంలో 20 ఏళ్ల వయసులో ఉన్నవారికి సొంత ఇల్లు ఉండే అవకాశం దీనికి దాదాపు రెండింతలు ఉండగా, అంతకుముందు తరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉండేది.
ప్రధాన కారణం ఇళ్ల ధరలు
దీర్ఘకాలంగా ఇళ్ల ధరలు మన ఆదాయాల కంటే వేగంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. తనఖా రుణాల మార్కెట్లో మార్పులు కూడా ప్రభావం చూపినప్పటికీ, ఇళ్ల నిర్మాణం తగినంతగా జరగకపోవడమే అసలు సమస్యగా హౌసింగ్ ఆర్థికవేత్త పాల్ చెషైర్ పేర్కొంటున్నారు.
జనాభా పెరుగుదల, చిన్న కుటుంబాల్లో నివసించే ధోరణికి అనుగుణంగా ఇంగ్లాండ్లో ఏటా మరో 300,000 ఇళ్లు అవసరమని ప్రభుత్వం గతంలో అంచనా వేసింది. అయితే గత ఏడాది 208,000 ఇళ్లు మాత్రమే నిర్మించారు. కనీసం మూడు దశాబ్దాలుగా ఏ ఏడాదిలోనూ 300,000 కొత్త ఇళ్ల నిర్మాణం జరగలేదు.
నిర్మాణ వ్యయాలు పైపైకి
భూమి, నిర్మాణ కార్మికుల వేతనాలు, ఇటుకలు సహా నిర్మాణ వ్యయాలు పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కలప, ఉక్కు, ప్లాస్టర్బోర్డ్, కాంక్రీట్, ఇన్సులేషన్ వంటి ముడి పదార్థాల లభ్యత తగ్గడంతో వాటి ధరలు మరింత పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం ఇంధన వ్యయాలను ఒక్క ఏడాదిలో 15 శాతం పెంచి నిర్మాణ ఖర్చులను మరింత పెంచింది. ఇరాన్లో యుద్ధం కూడా ధరలను మరింత పెంచింది. 2015లో £150,000తో నిర్మించగలిగిన ఇల్లు ఇప్పుడు £230,000 వరకు ఖర్చవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ వ్యయం మరో 15 శాతం పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
అయితే ఇటీవల ఇళ్ల ధరలు వేతనాల కంటే నెమ్మదిగా పెరుగుతున్నాయి. 2021లో సగటు ఆదాయానికి ఇళ్ల ధరల నిష్పత్తి దాదాపు 9 రెట్లు ఉండగా, ఇప్పుడు 7.6 రెట్లకు తగ్గింది. కొన్ని రుణ సంస్థలు 5 శాతం డిపాజిట్తోనే తనఖా రుణాలు ఇస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో 40 ఏళ్ల వరకు రుణ కాలపరిమితి కూడా అందుబాటులో ఉంది.
వడ్డీ రేట్లు ఇటీవలి గరిష్ఠ స్థాయి నుంచి తగ్గడం, ఇళ్ల ధరల పెరుగుదల మందగించడంతో వేతనాలతో పోలిస్తే తనఖా చెల్లింపుల భారం కూడా తగ్గింది. నేషన్వైడ్ గణాంకాల ప్రకారం, 2007లో తొలిసారి ఇల్లు కొనేవారి తనఖా చెల్లింపులు చేతికి వచ్చే ఆదాయంలో 45 శాతం ఉండగా, ప్రస్తుతం 32 శాతంగా ఉన్నాయి. దీర్ఘకాల సగటు 30 శాతంతో పోలిస్తే ఇది ఇంకా ఎక్కువే అయినా పరిస్థితి మెరుగుపడుతున్న దిశలో ఉంది.
అయితే తక్కువ డిపాజిట్, ఎక్కువ కాలపరిమితి రుణాలకు ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎక్కువ కాలం వడ్డీ చెల్లించాల్సి రావడంతో మొత్తం ఖర్చు పెరుగుతుంది. ఇళ్ల విలువ పెరగకపోతే కొనుగోలుదారులు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది.
ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కీర్ స్టార్మర్ ప్రభుత్వం ప్రణాళికా అనుమతుల ప్రక్రియను సరళీకరించే చర్యలు చేపట్టింది. గ్రీన్ బెల్ట్ ప్రాంతాల్లో మరిన్ని ఇళ్ల నిర్మాణానికి కూడా సంస్కరణలు అవకాశం కల్పించనున్నాయి. అయితే నిర్మాణ సంస్థలు మరింత నమ్మకంతో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకునే చర్యల ఫలితాలు కనిపించేందుకు మాత్రం ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులే అనేక దేశాల్లో ఉన్నాయని అంచనా.
ఇదీ చదవండి: 24 గంటల్లో ‘జంతర్ మంతర్ 2.0’.. సీజేపీ హెచ్చరిక


