ఢిల్లీ: భారత్ తరపున పలు దేశాల్లో రాయబారిగా పనిచేసిన తననే ఎస్ఐఆర్ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ దౌత్యవేత్త నవదీప్ సూరి అసహానం వ్యక్తం చేశారు. తన ఓటరు వివరాలు 2003 నాటి రికార్డులతో సరిపోలడం లేదని, భారత పౌరసత్వాన్ని నిరూపించేందుకు పత్రాలు సమర్పించాలని అధికారులు కోరినట్లు ఆయన తెలిపారు.ఓటర్ల జాబితా సవరణ కోసం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.
గతంలోనవదీప్ సూరి యూఏఈ, ఈజిప్ట్ సహా పలు దేశాల్లో భారత రాయబారిగా పనిచేశారు. అంతేకాకు ఆయన ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్గానూ సేవలందించారు.పంజాబ్లో SIR ప్రక్రియలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన ఆదివారం వరుస పోస్టుల ద్వారా వెల్లడించారు.
ఆయన మాటల్లో “పంజాబ్లో SIR విషయంలో నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. BLO (బూత్ లెవల్ ఆఫీసర్) వద్దకు వెళ్లి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు సమర్పించాను. అన్నీ సక్రమంగానే ఉన్నాయని నాకు హామీ ఇచ్చారు. అయితే ఈరోజు ఒక వాలంటీర్ నుంచి సందేశం వచ్చింది. 2003 నాటి SIR వివరాలతో కొన్ని అంశాలు సరిపోలడం లేదని అందులో తెలిపారు” అని పేర్కొన్నారు.
“నోటీసు తీసుకునేందుకు రావాలని, ఆ తర్వాత నేను భారతీయ పౌరుడినని నిరూపించే కొన్ని నిర్దిష్టంగా పేర్కొనని పత్రాలతో మళ్లీ రావాలని చెప్పారు. నేను 2003లో భారత్లో లేనని చెప్పాను. దాంతో పాస్పోర్ట్ను ఆధారంగా చూపించాలని వారు సూచించారు” అని ఆయన తెలిపారు. తన వద్ద ఓటర్ ఐడీ, ఆధార్తో పాటు ఇతర పత్రాలు కూడా ఉన్నాయని సూరి చెప్పారు.
అయితే, “మూడు దేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తర్వాత కూడా నా పౌరసత్వాన్ని నిరూపించుకోవడంలో నాకు ఇబ్బంది ఎదురైతే, సాధారణ పౌరుడి పరిస్థితి ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు. కాగా ఎస్ఐఆర్ ప్రక్రియలో గతంలోనూ కొంతమంది ప్రముఖులకు ఇలాంటి ఘటనలే ఎదురయ్యాయి. దీంతో సంబంధిత రికార్డులను పరిశీలించిన తర్వాత వాటిని అధికారులు స్పష్టీకరించి పరిష్కరించారు.


