గత ఐదేళ్లుగా అమెరికన్ హెచ్-1బీ వీసాలపై భారతీయ టెక్నాలజీ సంస్థలు ఆధారపడటం గణనీయంగా తగ్గిందని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. మన కంపెనీలు అక్కడి స్థానికులనే నియమించుకోవడం పెరిగిందని పేర్కొంది. వీసాల ఫీజుల పెంపు అంశాన్ని అమెరికాలో నిపుణుల కొరతను పరిష్కరించే దిశగా తీసుకుంటున్న చర్యల కోణంలో చూడాలని వివరించింది. భారతీయ టెక్నాలజీ పరిశ్రమ అమెరికాలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విభాగంపై 1.1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసినట్లు నాస్కామ్ వివరించింది.
ఈ క్రమంలో 29 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు, 2.55 లక్షల మంది ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు 130 పైగా యూనివర్సిటీలు, కాలేజీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తమ దేశ వ్యాపార సంస్థల్లో ఉద్యోగాలు చేసేందుకు తొలిసారిగా హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై అదనంగా 1,03,265 డాలర్ల ఫీజును విధించేలా అమెరికా ప్రతిపాదించిన నేపథ్యంలో నాస్కామ్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా గణాంకాల ప్రకారం ఇటీవలి కాలంలో ఆమోదం పొందిన హెచ్–1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయుల వాటా ఏకంగా 71 శాతంగా ఉంది.


