ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే నానుడిని నిజం చేస్తూ, అచ్చం తమలాగే ఉండే వ్యక్తుల కోసం నెటిజన్లు ఆన్లైన్లో వెతుకుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే సింగపూర్లో నివసిస్తున్న వినోషా రవి అనే యువతి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె ముఖ కవళికలు తమిళనాడు మంత్రి కీర్తనను పోలి ఉండటంతో ఈ వివాదం చెలరేగింది.
డీఎంకే శ్రేణులు, నెటిజన్లు, పొట్టి దుస్తులు ధరించిన ఒక మహిళ వీడియోను షేర్ చేస్తూ.. ఆ వీడియోలో ఉన్నది తమిళనాడు మంత్రియేనా అని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం మొదలైంది. నెటిజన్లు సైతం ఆ వీడియోలో ఉన్నది మంత్రేనని పొరపడి, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు. అయితే, ఆ వైరల్ వీడియోలో ఉన్నది తాను కాదని మంత్రి కీర్తన స్పష్టం చేశారు. కేవలం పోలికల కారణంగా ట్రోలింగ్కు గురైన సింగపూర్కు చెందిన వినోషా రవికి ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు.
ఈ పరిణామాలపై వినోషా రవి మాట్లాడుతూ..‘తొలత నా సహోద్యోగి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఆ వీడియోను తీశారు. మొదట దానిని నేను ఒక జోక్గా తీసుకున్నాను. ఇటువంటి పరిణామాలకు దారి తీస్తుందని అనుకోలేదు. కానీ, నెటిజన్ల నుంచి వచ్చిన విమర్శలు నన్ను పూర్తిగా డిప్రెషన్కు గురిచేశాయి. కొందరు పెట్టిన కామెంట్లు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి.
నా ప్రమేయం లేకుండా, నేను ఏ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయని వీడియోను రికార్డ్ చేసి ఆన్లైన్లో తప్పుగా ప్రచారం చేశారు. ఈ సంఘటన తర్వాత నేను బయటకు వెళ్లడానికి, కనీసం ఆఫీస్కు వెళ్లడానికి కూడా భయపడుతున్నానని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
బెదిరింపులు, అసభ్యకర సందేశాలు రావడంతో ఆమె మలేషియా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ట్రోలింగ్ వల్ల కలత చెంది భయపడినప్పటికీ, తాను వెనక్కి తగ్గేది లేదని వినోషా రవి స్పష్టం చేశారు. కొంతమంది ఆన్లైన్లో ట్రోల్ చేశారనే కారణంతో తాను తన వస్త్రధారణ శైలిని మార్చుకోబోనని తేల్చిచెప్పారు. మహిళలకు నీతులు చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఏమి, ఎలా దుస్తులు ధరించాలో మాకు బాగా తెలుసు’అని ఆమె అన్నారు. ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు ఎదుటి వ్యక్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో నెటిజన్లు ఆలోచించాలని, కేవలం వ్యూస్ కోసం బాధ్యతారహితంగా ప్రవర్తించవద్దని ఆమె హితవు పలికారు.


