కామారెడ్డి డిపోలో పనిచేస్తున్న మహిళా కండక్టర్లు
కామారెడ్డి డిపోలో 85 మంది మహిళా కండక్టర్లు
రాష్ట్రంలోనే అత్యధికంగా పనిచేస్తోంది ఇక్కడే..
ఎక్కువగా రద్దీ రూట్లలోనే విధులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్న ఆర్టీసీ డిపోగా కామారెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ మొత్తం 212 మంది కండక్టర్లుండగా.. ఇందులో 85 మంది మహిళా కండక్టర్లే కావడం విశేషం. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా మహిళలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం లేదు. కొంత ఆలస్యమైనా సరే ఆర్టీసీ బస్సు కోసం వేచిచూస్తున్నారు.
కొన్నిసార్లు బస్సుల్లో నిల్చునేందుకు కూడా స్థలం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో బస్సు నడిపే డ్రైవర్తో పాటు టికెట్ ఇచ్చే కండక్టర్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిండా ప్రయాణికులున్నా, కాలుకదిలించడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులున్నా ఓపికగా పనిచేస్తున్నారు. మహిళా కండక్టర్లు సింగిల్ క్రూ డ్యూటీలు, స్పెషల్ ఆఫ్ డ్యూటీలన్నీ చేస్తున్నారు.
రద్దీ రూట్లోనే ఎక్కువ మంది...
కామారెడ్డి బస్ డిపో పరిధిలో మహిళా కండక్టర్లు ఎక్కువగా రద్దీ రూట్లలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఎక్కువ మంది ప్రయాణించే బాన్సువాడ, కరీంనగర్, నిజాంసాగర్, రామాయంపేట రూట్లలో రెగ్యులర్గా డ్యూటీలు చేస్తున్నారు. ఉదయం 6 గంటలలోపు డిపోనకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తెల్లవారకముందే మేల్కొని ఇల్లు, వాకిలి శుభ్రం చేసి, వంట సిద్ధం చేసి సద్దిమూట కట్టుకొని డిపోనకు చేరుకుంటారు. 85 మందిలో దాదాపు అందరూ రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలోనే డ్యూటీ చేస్తున్నారని డిపో మేనేజర్ దినేశ్కుమార్ ‘సాక్షి’తో తెలిపారు.
భారం పెరిగింది..
మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. సమస్యలున్నా డ్యూటీ డ్యూటీయే కదా.. మా డిపోలో ఎక్కువ మంది మహిళా కండక్టర్లు ఉండడాన్ని గర్వంగా ఫీలవుతాం. – మహేశ్వరి, కండక్టర్
అన్నం పెడుతోంది...
పద్నాలుగేళ్లుగా డ్యూటీ చేస్తున్నా. కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తుంది. పనిలో అలసిపోతాం. అయినా, డ్యూటీకి వెళ్లాల్సిందే. కండక్టర్ ఉద్యోగమే అన్నం పెడుతున్న ప్పుడు ఇబ్బంది అయినా డ్యూటీ సక్రమంగా చేయాల్సిందే కదా. – శైలజ, కండక్టర్


