8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) అమల్లోకి వచ్చిన తర్వాత కొందరు కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు నిలిచిపోతాయని, 2026 తర్వాత పదవీ విరమణ చేసే వారికి మాత్రమే పెన్షన్ సవరణ వర్తిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) స్టాఫ్ సైడ్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా ఖండించారు. ఇలాంటి సందేశాలు పూర్తిగా నిరాధారమైనవని, వాటిని నమ్మవద్దని ఆయన పెన్షనర్లకు సూచించారు.
ఈ మేరకు ‘ఎక్స్’లో వీడియో సందేశం పోస్ట్ చేసిన శివ గోపాల్ మిశ్రా.. తన పేరుతోనే కొన్ని తప్పుడు సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిపారు. దీంతో పలువురు పెన్షనర్లు నేరుగా తనను సంప్రదించారని చెప్పారు. పెన్షన్ చెల్లింపులు నిలిపివేయడం లేదా గతంలో రిటైర్ అయిన వారికి పెన్షన్ సవరణ వర్తించదనే నిర్ణయం ఏదీ ప్రభుత్వం ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు.
“ప్రస్తుతం వేతన సంఘంతో ఈ అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో రిటైర్ అయినవారైనా, ఇకపై రిటైర్ అయ్యేవారైనా.. పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడేందుకు మేం కృషి చేస్తున్నాం. పెన్షన్లలో నిరంతర మెరుగుదల ఉండాలని కోరుకుంటున్నాం” అని మిశ్రా పేర్కొన్నారు. పెన్షనర్లు యూనియన్లు, ప్రభుత్వ సంస్థలు లేదా 8వ వేతన సంఘం వంటి అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
69 లక్షల మందికి సంబంధించిన అంశం
కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న 8వ కేంద్ర వేతన సంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ చైర్పర్సన్గా, ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్టైమ్ సభ్యుడిగా, పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా ఉన్నారు. కమిషన్కు నివేదిక సమర్పించేందుకు 18 నెలల గడువు ఉంది.
దాదాపు 50.14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సుమారు 69 లక్షల పెన్షనర్లకు ఈ వేతన సంఘం సిఫారసులు కీలకం కానున్నాయి. అయితే 8వ వేతన సంఘం సిఫారసులు ఎప్పటి నుంచి అమలు చేయాలనే తుది తేదీని ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదని లోక్సభలో కేంద్రం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఉద్యోగుల పంట పండినట్లే!!
ఎందుకీ సందేహాలు?
8వ వేతన సంఘం ప్రస్తుత ToRలో పెన్షన్, కుటుంబ పెన్షన్కు సంబంధించిన అంశాలను పరిశీలించే పరిధి ఉన్నప్పటికీ, 2026 జనవరి 1కు ముందు రిటైర్ అయిన వారి పెన్షన్ సవరణను స్పష్టంగా పేర్కొనలేదనే అభ్యంతరాలు పెన్షనర్ సంఘాల నుంచి వచ్చాయి. ఈ అంశంపై ToRలో మార్పులు చేయాలని సంఘాలు కోరుతున్నాయి.
🚨 Message from Shiva Gopal Mishra Ji
Shiva Gopal Mishra Ji has clarified that rumours about stopping pensions or denying pension revision to certain retirees are completely baseless. Pensioners can remain assured that pensions will continue regularly, with improvements being… pic.twitter.com/OMPEr6t3yD— 8th pay commission (@8thpaycommision) August 29, 2026


