బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడం మైనింగ్ కంపెనీలకు బాగా కలిసొస్తోంది. బంగారాన్ని తవ్వడానికి అయ్యే ఖర్చులు పెరుగుతున్నప్పటికీ.. బంగారం ధరలు అంతకంటే వేగంగా పెరగడంతో కంపెనీలకు భారీ లాభాలు వస్తున్నాయి. దీంతో వాటి మార్జిన్లు, నగదు ప్రవాహాలు కూడా రికార్డు స్థాయికి చేరాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
మైనింగ్ ఖర్చులు
2026 జనవరి-మార్చి త్రైమాసికంలో ఒక ఔన్స్ బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి మైనింగ్ కంపెనీలకు సగటున 1,785 డాలర్లు ఖర్చైంది. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 5 శాతం, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం ఎక్కువ. మైనింగ్ రంగంలో ఉత్పత్తి ఖర్చులు వరుసగా 28వ ఏడాది పెరగడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే బంగారం తవ్వకం రోజురోజుకూ ఖరీదవుతోందని స్పష్టమవుతోంది.
రాయల్టీల భారం
మైనింగ్ కంపెనీల ఖర్చులు పెరగడానికి రాయల్టీ చెల్లింపులు కూడా ఒక ప్రధాన కారణంగా మారాయి. జనవరిలో బంగారం ధర ఔన్స్కు 5,595 డాలర్ల వరకు వెళ్లింది. ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వాలకు చెల్లించాల్సిన రాయల్టీలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. 2026 మొదటి త్రైమాసికంలో రాయల్టీ ఖర్చులు గత త్రైమాసికంతో పోలిస్తే 24 శాతం, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 85 శాతం పెరిగాయి. కొన్ని సంవత్సరాల క్రితం మైనింగ్ కంపెనీల మొత్తం ఖర్చుల్లో రాయల్టీల వాటా తక్కువగా ఉండగా.. ఇప్పుడు అది 12 శాతానికి చేరింది.
ఆఫ్రికా దేశాల్లో కొత్త రూల్స్
పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని దేశాలు బంగారం ధరలు పెరిగినప్పుడు ఎక్కువ రాయల్టీ వసూలు చేసే విధానాలను తీసుకొచ్చాయి. ఘనా, బుర్కినా ఫాసో, మాలి వంటి దేశాల్లో కొత్త రాయల్టీ విధానాలు అమల్లోకి వచ్చాయి. దీంతో అక్కడ బంగారం తవ్వుతున్న కంపెనీల ఖర్చులు మరింత పెరిగాయి. ఉదాహరణకు బుర్కినా ఫాసోలోని గనిలో రాయల్టీ ఖర్చులు ఏడాదిలో ఏకంగా 220 శాతం పెరిగాయి.
కంపెనీలకు ప్లస్
ఖర్చులు పెరిగినా.. మైనింగ్ కంపెనీలకు పెద్దగా ఇబ్బంది లేకపోవడానికి ప్రధాన కారణం బంగారం ధరలు భారీగా పెరగడమే. 2026 మొదటి త్రైమాసికంలో బంగారం సగటు ధర గత త్రైమాసికంతో పోలిస్తే 17 శాతం, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 70 శాతం పెరిగింది. దీంతో కంపెనీలకు ఒక్క ఔన్స్ బంగారంపై వచ్చే మార్జిన్ రికార్డు స్థాయికి చేరింది. మైనింగ్ కంపెనీల సగటు AISC మార్జిన్ ఔన్స్కు 3,076 డాలర్లకు చేరింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 25 శాతం, ఏడాది వ్యవధిలో ఏకంగా 134 శాతం పెరిగింది.
షేర్హోల్డర్లకు డబ్బు
కంపెనీల చేతిలోకి భారీగా నగదు రావడంతో ఆ మొత్తాన్ని షేర్హోల్డర్లకు కూడా తిరిగి ఇస్తున్నాయి. డివిడెండ్లు, షేర్ బైబ్యాక్ల రూపంలో పెద్ద మొత్తాలను ఖర్చు చేస్తున్నాయి.
న్యూమాంట్ సంస్థ ఈ త్రైమాసికంలో 3.1 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి ఫ్రీ క్యాష్ ఫ్లోను సాధించింది. ఇందులో 2.7 బిలియన్ డాలర్లను షేర్హోల్డర్లకు తిరిగి ఇచ్చింది. మరో 6 బిలియన్ డాలర్ల షేర్ బైబ్యాక్ ప్రోగ్రామ్కు కూడా ఆమోదం తెలిపింది. ఆంగ్లోగోల్డ్ అశాంతి కూడా 1.2 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి ఫ్రీ క్యాష్ ఫ్లోను నమోదు చేసింది. దీంతో కంపెనీ నికర రుణ స్థితి నుంచి నికర నగదు స్థితికి చేరుకుంది.
ఇరాన్ వివాదం
మరోవైపు.. ఇరాన్ వివాదం కారణంగా సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలతో ఇంధనం, రవాణా, మైనింగ్కు అవసరమైన ఇతర వస్తువుల ధరలు పెరిగాయి. అమెరికాలో హోల్సేల్ డీజిల్ ధరలు 54 శాతం పెరగగా.. పెర్త్లో 96 శాతం వరకు పెరిగాయి. అయితే పెద్ద మైనింగ్ కంపెనీలు ముందుగానే చేసుకున్న ఒప్పందాలు, ఇంధన నిల్వలు, హెడ్జింగ్ వంటి చర్యల వల్ల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోగలిగాయి.
ఖర్చులు ఇంకా పెరగొచ్చు
ఇరాన్ వివాదం, సరఫరా సమస్యలు ఇలాగే కొనసాగితే.. మైనింగ్ కంపెనీల ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని WGC చెబుతోంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంధనం, రవాణా, ఇతర మైనింగ్ వస్తువుల ధరల ప్రభావం రెండో త్రైమాసికంలో మరింత స్పష్టంగా కనిపించొచ్చు.
అంటే ప్రస్తుతం బంగారం ధరలు మైనింగ్ కంపెనీలకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్నప్పటికీ.. ఖర్చులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే కంపెనీలకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బంగారం ధరలు తగ్గి, మైనింగ్ ఖర్చులు మాత్రం పెరిగితే లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెరగవచ్చు.
ఇదీ చదవండి: వెండికి ఫుల్ డిమాండ్.. అసలు కారణాలు ఇవే!


