జాతీయ రహదారి మధ్యలో కూర్చుని ఒక కుటుంబం భోజనం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. వైరల్ వీడియో రహదారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, హైవేను పిక్నిక్ స్పాట్గా మార్చారంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, ఈ పోస్ట్ చేసిన ఆ కుటుంబ సభ్యులలో ఒకరిని సంప్రదించిన మీడియా.. అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చింది.
శివ ప్రకాష్ మాట్లాడుతూ, ఆగస్టు 12న 'హరియావలి అమావాస్య' సందర్భంగా ఈ వీడియో రికార్డ్ అయినట్లు తెలిపారు. తాను తన కుటుంబంతో కలిసి మేనాల్ జలపాతాలకు వెళ్లామని.. చిత్తూరుగఢ్లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా హైవే పక్కన ఉన్న ఒక 'లే-బై' (లే-బై అంటే వాహనాలు ఆపే స్థలం) వద్ద దాదాపు 15 నిమిషాల పాటు ఆగామని చెప్పారు.
ఆ రోజు కుండపోత వర్షం కురుస్తోంది. ఆ కుటుంబంలో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. సమయం సాయంత్రం 4:30 దాటింది, అందరికీ తీవ్రమైన ఆకలి వేసింది. భోజనం చేయడానికి ఏదైనా హోటల్ లేదా సురక్షితమైన ప్రదేశం ఉందా అని స్థానిక గ్రామస్తులను అడగ్గా.. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే హైవే పక్కనే ఉన్న ఒక 'లే-బై' గురించి వారు చెప్పారు.
An Indian family proudly having lunch on a newly inaugurated expressway,
as if trespassing onto public infrastructure and turning it into a picnic spot is some achievement.
What’s even more disturbing is the sense of pride they seem to take in such blatant disregard for basic… pic.twitter.com/8NQY5WZW0H— Ritik (@ThenNowForeve) August 29, 2026
ఆకలితో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధుల కోసం గ్రామస్తుల సూచన మేరకు కేవలం 15 నిమిషాలు మాత్రమే అక్కడ ఆగి భోజనం చేశామని, వెంటనే తమ ప్రయాణం కొనసాగించామని శివ తెలిపారు. తాను ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, కొందరు దీనిని వక్రీకరించి హైవే మధ్యలోనే కుటుంబం కూర్చున్నట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. వర్షం కురుస్తున్న సమయంలో పిల్లలు, వృద్ధులతో ప్రయాణిస్తున్నప్పుడు ఆకలి వేయడంతో ఇలా జరిగిందని.. ఎవరి ప్రాణాలకూ ప్రమాదం తలపెట్టాలనే ఉద్దేశం తమకు లేదని శివ స్పష్టం చేశారు.


