దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా దుబాయ్లోని బిన్ సనత్ లేబర్ క్యాంప్, సోనాపూర్లో అన్నదాన సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గల్ఫ్ కో-కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా, ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్ రెడ్డి, ప్రసన్న సోమిరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాజా రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, కోటేశ్వర రెడ్డి, నరేష్ చౌదరి, జనార్దన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, రమణ రెడ్డి , ఇషాల్ , వెంకట్ రెడ్డి, షరీఫ్, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రియతమ మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా..ఆయన చేసిన సేవలు, అమలు చేసిన కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నారు. అంతేగాదు వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, భవిష్యత్తులో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు గల్ఫ్ కో-కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా.
(చదవండి: మరపురాని మహానేత.. జలప్రదాత వైఎస్సార్)


