అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని, పురస్కరించుకొని నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘తెలుగుకు పరుగు – Run4Telugu 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది.
వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, ఇల్లినాయిస్, మిషిగన్, మిన్నెసోటా, మిస్సోరీ, న్యూ జెర్సీ, ఒక్లాహోమా, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా తదితర రాష్ట్రాలలోని సుమారు 25 ప్రాంతాల నుంచి మూడువేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని సమాజానికి అందించాలనే లక్ష్యంతో మనబడి భాషా సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ‘తెలుగుకు పరుగు’లో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకులు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ, మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతుల గురించి వివరించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను తెలియజేస్తూ, తెలుగు భాషను భావితరాలకు అందించడం ప్రతి తెలుగు కుటుంబం బాధ్యత అని గుర్తుచేశారు. అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాలలో మనబడి నిర్వహిస్తున్న తెలుగు తరగతులు, కార్యక్రమాల గురించి కూడా వివరించారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన మనబడి అధ్యక్షులు, కులపతి చమర్తి రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగుకు పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు. Run4Telugu పోటీలను రెండు విభాగాలలో నిర్వహించారు.
ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి మెడల్స్తో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనబడి ధృవపత్రాలను అందజేశారు. ఆయా ప్రాంతాలలో పాల్గొన్న వారికి అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు. అంతేగాదు “తెలుగు నేర్చుకుందాం… తెలుగు మాట్లాడుదాం… తెలుగు భాషను భావితరాలకు అందిద్దాం” అనే మనబడి సందేశాన్ని అమెరికా వ్యాప్తంగా ధ్వనింపచేసేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
(చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు)


